chennai: తన చెప్పులు పోయాయట.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు!

  • మాయమైన పది జతల చెప్పులు
  • వాటి ఖరీదు రూ. 60 వేల పైమాటే
  • కొందరిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఫిర్యాదు

తన చెప్పులు పోయాయంటూ ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు చూసి పోలీసులు నోరెళ్లబెట్టారు. చెన్నైలో జరిగిందీ ఘటన. కీల్‌పాక్ ప్రాంతానికి చెందిన అబ్దుల్ హఫీజ్ వ్యాపారి. గత శనివారం ఆయన సెక్రటేరియట్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన చెప్పులు పోయాయంటూ ఫిర్యాదు చేశాడు. మొత్తం పది జతల చెప్పులు మాయమయ్యాయని, వాటి విలువ రూ.60 వేలకు పైనేనని ఫిర్యాదులో పేర్కొన్నాడు.

ఉదయం తాను ఇంట్లోకి వెళ్లినప్పుడు ఉన్న చెప్పులు గంట తర్వాత కనిపించలేదని పేర్కొన్నాడు. మాయమైన చెప్పుల్లో బ్రాండెడ్‌వి కూడా ఉన్నాయని, వాటి విలువ వేలల్లో ఉంటుందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తన ఇంట్లో పనిచేసే వ్యక్తులు కానీ, కాలనీలోని యువకులు కానీ తీసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశాడు. అబ్దుల్ ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

More Telugu News