Lakshmiparvathi: చంద్రబాబు పసిగట్టారు.. జూనియర్ ఎన్టీఆర్ ని దూరం పెట్టారు: లక్ష్మీపార్వతి

  • లోకేశ్ ను ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవిని కట్టబెట్టారు!
  • ఎన్టీఆర్ వారసుడు జూనియర్ ఎన్టీఆరే
  • తాత పేరు నిలబెట్టే లక్షణాలు జూ.ఎన్టీఆర్ లో ఉన్నాయి

2009 ఎన్నికల ప్రచారం తర్వాత ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ ను టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు దూరం పెట్టారని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విమర్శలు చేయడం తెలిసిందే. ఈ విమర్శలను టీడీపీ నేతలు ఖండిస్తున్నారు. అయితే, ఇదే వ్యాఖ్యలపై ఏపీ తెలుగు అకాడమీ చైర్ పర్సన్, వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి స్పందించారు.

 సాక్షి ఛానెల్ నిర్వహించిన ఓ చర్చా కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, చంద్రబాబు తన హయాంలో లోకేశ్ ను ఎమ్మెల్సీ చేసి, ఆ తర్వాత మంత్రి పదవిని కట్టబెట్టడం ద్వారా కాబోయే సీఎం తన కొడుకే అన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పకుండానే పార్టీ నేతలకు చెప్పారని అన్నారు. అయితే, టీడీపీలో అంతర్గతంగా గానీ, ప్రజల్లో గానీ ఎన్టీఆర్ వారసుడు జూనియర్ ఎన్టీఆరే అని ఉందని, ఎప్పుడైతే ఈ విషయాన్ని చంద్రబాబు పసిగట్టారో, వెంటనే, అతన్ని పక్కనబెట్టారని అభిప్రాయపడ్డారు. తాత ఎన్టీఆర్ పేరు నిలబెట్టే లక్షణాలు జూనియర్ ఎన్టీఆర్ లో ఉన్నాయని కొనియాడారు.

More Telugu News