Andhra Pradesh: ఏపీకి పెట్టుబడులు చాలా అవసరం: మంత్రి బొత్స సత్యనారాయణ

  • పెట్టుబడుల రూపంలో అవినీతికి ఆస్కారం ఇవ్వం
  • ప్రతిపక్ష నేతల విమర్శలు తగదు
  •  సీఎం వైఎస్ జగన్ పాలన ఓ చరిత్ర

ఏపీకి పెట్టుబడులు చాలా అవసరమని, అయితే, పెట్టుబడుల పేరుతో దోపిడీ విధానాన్ని మాత్రం తమ ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లోనూ సహించదని మంత్రి బొత్స సత్యనారాయణ మరోమారు స్పష్టం చేశారు. అనంతపురంలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పెట్టుబడుల రూపంలో అవినీతికి ఆస్కారం ఇవ్వమని చెప్పారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష టీడీపీ నాయకులపై ఆయన మండిపడ్డారు.

రైతు భరోసా ద్వారా రైతులకు సాయం అందిస్తున్నామని, యువతకు ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నప్పటికీ టీడీపీ నాయకులు తమ ప్రభుత్వంపై  విమర్శలు చేయడం తగదని హితవు పలికారు. ఉద్యోగాలను అయినవాళ్లకే ఇస్తున్నారన్న ఆరోపణలు తగవని అన్నారు. అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే ఇచ్చిన హామీలకు చట్టబద్ధత కల్పించామని, సీఎం వైఎస్ జగన్ పాలన ఓ చరిత్ర అని ప్రశంసించారు. అనంతపురం జిల్లాలో మరో మూడు వ్యవసాయ మార్కెట్ కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నామని పేర్కొన్నారు.

More Telugu News