Nara Lokesh: కత్తులు, కొడవళ్లతో వైసీపీ నాయకులు దాడులకు దిగి ప్రజల తలలు పగలగొట్టారు: నారా లోకేశ్

  • వైసీపీ రాక్షస పాలన పరాకాష్ఠకు చేరుకుంది
  • ఇప్పటివరకు టీడీపీ కార్యకర్తలను హత్య చేశారు
  • ఇప్పుడు వైసీపీ రౌడీలు మరో అడుగు ముందుకేశారు
  • కర్నూలు జిల్లా కాల్వబుగ్గ గ్రామస్తులపై దాడి చేశారు

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. కర్నూలు జిల్లా కాల్వబుగ్గ గ్రామస్తులు తాగునీరు కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు.

'వైసీపీ రాక్షస పాలన పరాకాష్ఠకు చేరుకుంది. ఇప్పటివరకు టీడీపీ కార్యకర్తలను హత్య చెయ్యడం, వారు ఇళ్ల నుండి బయటకి రాకుండా గోడలు కట్టడం, వేధించి ఆత్మహత్యలు చేసుకునేలా చెయ్యడం వంటి చర్యలకు పాల్పడ్డారు. ఇప్పుడు వైసీపీ రౌడీలు మరో అడుగు ముందుకేసి ఏకంగా ప్రజలపై పడ్డారు' అని లోకేశ్ ట్వీట్ చేశారు.

'కర్నూలు జిల్లా కాల్వబుగ్గ గ్రామస్తులు తాగునీరు ఇవ్వండని వేడుకున్నారు. ఫలితం లేకపోయేసరికి గ్రామస్తులే బోర్ రిపేర్ చేసుకునేందుకు ప్రయత్నించారు. ఈ మాత్రం దానికే కత్తులు, కొడవళ్లతో వైసీపీ నాయకులు దాడులకు దిగి ప్రజల తలలు పగలగొట్టారు' అని లోకేశ్ పేర్కొన్నారు.
 
'అక్క, చెల్లి నన్ను గెలిపిస్తే మీ ఇంటి ముందు నవరత్నాలు పోస్తా అన్నారు జగన్ గారు. నవరత్నాలు దేవుడెరుగు తాగడానికి గుక్కెడు నీరు ఇస్తే చాలు అనుకుంటున్నారు మా అక్కాచెల్లెళ్లు' అని లోకేశ్ మరో ట్వీట్ లో విమర్శించారు.

More Telugu News