Wife: తన భార్య మరో పెళ్లి చేసుకుందంటూ... పోలీసులకు ఫిర్యాదు!

  • 1999లో ప్రేమ వివాహం
  • 2016 తరువాత విభేదాలు
  • కోర్టు కేసు నడుస్తుండగానే పెళ్లి!

తనకు విడాకులు ఇవ్వకుండానే, తన భార్య మరో వివాహం చేసుకుందంటూ ఓ వ్యక్తి హైదరాబాద్, బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే, శ్రీకృష్ణా నగర్ కు చెందిన అశోక్ అనే వ్యక్తి, 1999లో జ్యోతీశ్వరి అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. 2016 వరకూ వీరి సంసారం బాగానే సాగింది. ఆ తరువాత ఇద్దరి మధ్యా గొడవలు వచ్చాయి.

ఖమ్మం ప్రాంతానికి చెందిన వేణుగోపాల రావు అనే వ్యక్తి వీరి జీవితంలోకి వచ్చాడు. జ్యోతీశ్వరితో పరిచయం పెంచుకుని, వివాహేతర బంధాన్ని కొనసాగించాడు. ఈ నేపథ్యంలో అశోక్, జ్యోతీశ్వరి విడిపోవాలని నిర్ణయించుకుని, పరస్పర అంగీకారంతో విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ కేసు కోర్టులో నడుస్తుండగానే జ్యోతీశ్వరి, వేణుగోపాలరావుల వివాహం జరిగింది.

కోర్టులో కేసు నడుస్తుండగానే ఆమె వివాహం చేసుకుందని, ఆపై వారిద్దరూ భార్యాభర్తలుగా చెప్పుకుంటూ బ్యాంకులో ఇంటి రుణాన్ని తీసుకున్నారని అశోక్ ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం కేసును విచారిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.

More Telugu News