Rekha: మీరింత అందంగా ఎలా ఉన్నారండీ అని అడిగిన నాగ్ కు రేఖ కౌంటర్!

  • హైదరాబాదులో ఏఎన్నార్ అవార్డుల కార్యక్రమం
  • హాజరైన రేఖ, బోనీ కపూర్, చిరంజీవి, నాగార్జున
  • అందం గురించి ఒకర్నొకరు పొగుడుకున్న రేఖ, నాగ్

టాలీవుడ్ మన్మథుడు నాగార్జున, బాలీవుడ్ అందాలరాశి రేఖ ఇద్దరూ ఒకే వేదికపై ఉంటే ఎలా ఉంటుందో చూడాలంటే ఏఎన్నార్ జాతీయ అవార్డుల కార్యక్రమానికి వెళ్లాల్సిందే. ఈ అవార్డుల పురస్కారం హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున తదితరులు హాజరైన ఈ కార్యక్రమానికి బాలీవుడ్ నుంచి రేఖ, మహానటి శ్రీదేవి భర్త బోనీ కపూర్ విచ్చేశారు. రేఖ, శ్రీదేవిలకు ఈ ఏడాది ఏఎన్నార్ జాతీయ అవార్డులు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో నాగార్జున, రేఖ మధ్య ఆసక్తికర సంభాషణ నడిచింది.

మీరింత అందంగా ఎలా ఉంటారండీ అని నాగ్ ప్రశ్నించగా, అసలు మీరింత అందంగా ఎందుకున్నారో నాకు చెప్పండి, మీరెలా అందంగా ఉన్నారో నేను అలాగే అంటూ రేఖ కౌంటర్ వేశారు. అందం అనేది మన కళ్లలో ప్రతిఫలిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా రేఖ పూర్తిగా తెలుగులోనే మాట్లాడి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. అంతకుముందు నాగ్ మాట్లాడుతూ, రేఖ, శ్రీదేవి గార్లు తెలుగువాళ్లేనని వెల్లడించారు.

కమర్షియల్ సినిమాలు, కళాత్మక సినిమాలను ఎలా బ్యాలన్స్ చేసుకునేవాళ్లు అని నాగ్ అడగ్గా, తనకు నటించడం ఒక్కటే తెలుసని, కమర్షియల్ చిత్రమా, కళాత్మక చిత్రమా, అది ఏ భాషా చిత్రమా అని ఎప్పుడూ చూసుకోలేదని, సినిమా ఈజ్ సినిమా అంటూ సమాధానం ఇచ్చారు.

More Telugu News