Virat Kohli: షర్ట్ విప్పి మైదానంలోకి దూసుకొచ్చిన అభిమాని... ప్రేమగా భుజంపై చెయ్యేసి మాట్లాడిన కోహ్లీ!

  • ఇండోర్ లో బంగ్లాదేశ్ తో టెస్ట్ మ్యాచ్
  • అభిమానిని ఏమీ అనవద్దని చెప్పిన కోహ్లీ
  • కోహ్లీ స్పందనకు నెటిజన్ల ఫిదా

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఎంతమంది ఫ్యాన్స్ ఉంటారో చెప్పడం చాలా కష్టం. వారంతా కోహ్లీని ఒక్కసారి అయినా, కలవాలని, అతనితో మాట్లాడాలని, వీలైతే సెల్ఫీ దిగాలని కలలు కంటుంటారు. కానీ, పోలీసుల భద్రత, బారికేడ్లు వారికి ఆ అవకాశం ఇవ్వవు. ఇదే సమయంలో కొందరు మాత్రం వాటిని చేధించుకుని దూసుకొస్తుంటారు. అటువంటి ఘటనే నిన్న ఇండోర్ లో బంగ్లాదేశ్ తో మ్యాచ్ జరుగుతున్న వేళ జరిగింది. తొలి టెస్టులో భాగంగా కోహ్లీ మైదానంలో ఉన్న వేళ, ఓ అభిమాని, తన షర్ట్ విప్పేసి మరీ మైదానంలోకి దూసుకుని వచ్చాడు. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది అతన్ని వెంబడించి, పట్టుకోవడంతో, కోహ్లీ స్పందించాడు. తన అభిమాని వద్దకు వచ్చి, భుజంపై చెయ్యేసి మాట్లాడాడు. ఇటువంటి పనులు కూడవని చెబుతూ, మైదానం బయటకు పంపాడు. అతన్ని ఏమీ చేయవద్దని సెక్యూరిటీకి సూచించాడు. ఇప్పుడు ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఫ్యాన్స్ పట్ల కోహ్లీ స్పందించిన తీరుకు నెటిజన్లు ఫిదా అయ్యారు.

కాగా, మైదానంలోకి దూసుకు వచ్చిన యువకుడి పేరు సూరజ్ అని, ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందినవాడని, కోహ్లీకి వీరాభిమాని అని అన్నాడు. కోహ్లీ పేరును తన చేతిపై పచ్చబొట్టుగా పొడిపించుకున్నాడని, శరీరంపై 'వీకే' అని రంగుల పచ్చబొట్టు పొడిపించుకున్నాడని వెల్లడించారు. బంగ్లాదేశ్ తో ఐదు రోజుల టెస్ట్ మ్యాచ్ ని మూడో రోజే ముగించిన భారత్, ఇన్నింగ్స్, 130 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నెల 22 నుంచి కోల్ కతా వేదికగా, రెండో టెస్ట్ ప్రారంభం కానుంది. తొలి టెస్ట్ అనంతరం మీడియాతో మాట్లాడిన కోహ్లీ, అభిమానులే తమకు స్ఫూర్తని, వారి ప్రోత్సాహంతోనే మ్యాచ్ లను గెలుస్తుంటామని వ్యాఖ్యానించాడు.

More Telugu News