Jagityala: ప్రియురాలికి నిశ్చితార్థం... విడిగా ఉండలేమని యువతీ, యువకుల ఆత్మహత్య!

  • జగిత్యాల జిల్లాలో ఘటన
  • మూడేళ్లుగా ప్రేమించుకున్న శిరీష, మహిపాల్
  • శిరీషకు నిశ్చితార్థం జరగడంతో ఆత్మహత్య

గత మూడేళ్లుగా ప్రేమలో ఉన్న ఓ జంట, తమకు వివాహం జరగదన్న మనస్తాపంతో ఒకే చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన జగిత్యాల జిల్లా కథలాపూర్ లో కలకలం రేపింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, గ్రామంలోని భూక్యా శిరీష, లకావత్ మహిపాల్ కలిసి డిగ్రీ చదువుకున్నారు. ఈ క్రమంలో ప్రేమలో పడిన ఇద్దరూ వివాహం చేసుకోవాలని భావించారు. కానీ, వీరి పెళ్లికి అంగీకరించని శిరీష తల్లిదండ్రులు, మరో యువకుడితో వివాహం నిశ్చయించారు. ఇటీవల శిరీషకు నిశ్చితార్థం కూడా జరిగింది. ప్రియుడిని వదిలి, మరో యువకుడిని పెళ్లాడటం ఇష్టంలేని శిరీష, ప్రియుడితో కలిసి ఆత్మహత్య చేసుకుంది. నిన్న ఉదయం ఇంటి నుంచి బయటకు వచ్చిన ఇద్దరూ, గ్రామ శివార్లలోని ఓ చెట్టుకు ఉరేసుకున్నారు. వీరిని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి వచ్చిన పోలీసులు, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో రెండు కుటుంబాల్లో విషాదం అలముకుంది. ప్రేమ విషయం తమకు గట్టిగా చెప్పుంటే, అంగీకరించి వుండేవాళ్లమని పెద్దలు కన్నీరు మున్నీరయ్యారు.

More Telugu News