Yamini Sadineni: వైసీపీలోకి వెళ్లేందుకు ప్రయత్నించాననడం అబద్ధం: యామిని

  • ఇటీవలే టీడీపీని వీడిన యామిని
  • బీజేపీలో చేరుతున్నట్టు ప్రచారం
  • మీడియా చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన యామిని

టీడీపీలో నిన్నమొన్నటి దాకా అధికార ప్రతినిధి హోదాలో గళం వినిపించిన యామిని సాదినేని ఇటీవలే ఆ పార్టీకి వీడ్కోలు పలికారు. ఇప్పుడామె బీజేపీ వైపు అడుగులేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో యామిని ఓ మీడియా చానల్ కు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు.

యాంకర్ అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ, తాను వైసీపీలోకి వెళ్లేందుకు ప్రయత్నించానంటూ వస్తున్న వార్తల్లో నిజంలేదని స్పష్టం చేశారు. 'అలా అంటున్న వారిని నా ముందుకు తీసుకురాగలరా? నేను కూడా వాళ్ల ముఖాలు చూస్తాను' అంటూ యాంకర్ ను తిరిగి ప్రశ్నించారు. తాను ప్రయత్నం చేశానని, వైసీపీ వాళ్లు తలుపులు మూసేశారని వస్తున్న కథనాలు వృథా మాటలని అభిప్రాయపడ్డారు. తానేమీ ఎంపీ, ఎమ్మెల్యే కంటెస్టెంట్ ను కాదని, తనకు ఎలాంటి ప్రయోజనాలు లేవని, ప్రజాసేవే పరమావధి అని చెప్పారు.

More Telugu News