Crime News: అనుమానంతో భార్యను రాళ్లతో కొట్టి చంపేసిన భర్త!

  • తమ్ముడితో కలిసి దారుణం
  • మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పంటించిన నిందితులు
  • అనుమానంతో కూపీలాగిన పోలీసులు

భార్య పరాయి మగాడితో శారీరక సంబంధం కలిగి ఉందన్న అనుమానంతో తమ్ముడితో కలిసి ఆమెను దారుణంగా హత్య చేశాడు ఓ భర్త. అనంతపురం జిల్లా శింగనమల మండలం గోవిందరాయుని పేటలో జరిగిన ఈ దారుణానికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు. గ్రామానికి చెందిన ఫకృద్దీన్, శంషాద్ (26) దంపతులు. భార్యకు వివాహేతర సంబంధం ఉందన్నది ఫకృద్దీన్ అనుమానం. ఈ విషయంలో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి.

ఈ నేపథ్యంలో భార్యను వదిలించుకోవాలనుకున్న ఫకృద్దీన్ ఇందుకు తమ్ముడు దస్తగిరి సాయం కోరాడు. ఫకృద్దీన్ మేకలు పెంచుతుంటాడు. ఈనెల ఏడో తేదీన ఫకృద్దీన్ ఎప్పటిలాగే మేకలు తోలుకుని కొండపైకి వెళ్లాడు. కాసేపటి తర్వాత భార్యకు ఫోన్ చేసి మేకపిల్లను తీసుకువెళ్లాలని, వెంటనే కొండ పైకి రావాలని కోరాడు.

ఇది నిజమేనని భావించిన శంషాద్ వెంటనే కొండ పైకి వెళ్లింది. అక్కడ ఫకృద్దీన్, సోదరుడు దస్తగిరి కలసి రాళ్లతో కొట్టి శంషాద్ ను చంపేశారు. అనంతరం పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఏమీ తెలియనట్టు ఊర్లోకి వచ్చి తన భార్య ఆత్మహత్య చేసుకుందంటూ ప్రచారం చేశాడు. ఘటనా స్థలిని సందర్శించిన పోలీసులు శంషాద్ ది హత్యగా అనుమానించి ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించారు.

భర్త పై ఓ కన్నేసి ఉంచారు. అతని పొంతనలేని మాటలు, వ్యవహారశైలి చూసి అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ప్రశ్నించారు. దీంతో సోదరుడితో కలిసి తానే హత్య చేసినట్లు ఫకృద్దీన్ అంగీకరించడంతో అరెస్టు చేసి కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్ కు పంపించారు.

More Telugu News