cm: జగన్మోహన్ రెడ్డి బీఏనో, బీకామో చదివారంటారు..పాసయ్యాడని తెలుసా?: నారా లోకేశ్

  • టెన్త్ క్లాస్ పేపర్ లీక్ లో జగన్ దొరికాడు 
  • నేను మాట్లాడేటప్పుడు ఒక పదం అటూఇటూ కావచ్చు
  • జగన్ లా నేను నలభై రెండు వేల కోట్లు దొబ్బలా 

ఏపీ సీఎం జగన్ ఏం చదివారో? అసలు, పాసయ్యారో? లేదో? అని టీడీపీ నేత నారా లోకేశ్ ప్రశ్నల వర్షం కురిపించారు. నెల్లూరులో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు.

‘మీరు తెలుగు మీడియంలో చదువుకోలేదు, మరి, ఏవిధంగా తెలుగు భాష గురించి ఉద్యమం చేస్తారంటూ వైసీపీ విమర్శలు చేస్తోంది. మీరు ఏ మీడియంలో చదువుకున్నారని అడుగుతున్నారు. దీనికి సమాధానం చెబుతారా?’ అనే ప్రశ్నకు లోకేశ్ బదులిస్తూ, ‘తప్పనిసరిగా చెబుతా. అసలు, జగన్మోహన్ రెడ్డి ఏం చదివారో మీకు తెలుసా? ఆయన బీఏనో, బీకామో చదివారంటారు, పాసయ్యాడని తెలుసా మీకు? టెన్త్ క్లాస్ పేపర్ లీక్ లో దొరికాడు ఆయన. ఇప్పుడు వాళ్లొచ్చి నీతులు చెబుతున్నారు. ఇంగ్లీషు మీడియం వుండాలి కానీ ఆప్షన్ ప్రజలకు ఇవ్వాలి. ఇంగ్లీషు మీడియం కావాలో తెలుగు మీడియం కావాలో పేరెంట్స్ నిర్ణయిస్తారు. ఆ ఆప్షన్ ఇవ్వమంటే ఎగతాళి చేస్తున్నారు వీళ్లు. ఆనాడు మున్సిపల్ స్కూల్స్ లో ఇంగ్లీషు మీడియం మేము పెడితే.. దొంగ పేపర్, దొంగ ఛానెల్ ‘సాక్షి’ వ్యతిరేకంగా రాశారు!

నేను ఇంగ్లీషు మీడియంలో అమెరికాలో చదివాను. నేను ఎక్కడ చదివానో నాకు తెలుసు. ‘స్టాన్ ఫోర్డ్’ లో ఎంబీఏ తీసుకుని వచ్చాను. ప్రజాసేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చాను. నేను ఒక పదం అటూఇటూ వేయొచ్చు కానీ, నలభై రెండు వేల కోట్లు దొబ్బలా. నేను పదహారు నెలలు జైలుకెళ్లలేదు. ‘రావాలి జగన్ కావాలి జగన్’ అని కోర్టు అంటోంది. దాని గురించి మాట్లాడమనండి. రాజకీయాల్లోకి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకొచ్చారు? డబ్బులు దొబ్బేందుకు వచ్చారు. నాన్నను అడ్డం పెట్టుకుని బాగా లాగాడు కదా! మేము లక్ష కోట్లు అని చెప్పాం. సీబీఐకు నలభై రెండు వేల కోట్లే దొరికింది. మిగతా 68 వేల కోట్లు దొరకలా.. వెతుకుతున్నారు ఇంకా. లక్ష కోట్లు దొబ్బాడు ఆయన. ఆయనొచ్చి నీతులు చెబుతున్నాడు" అన్నారు లోకేశ్.

More Telugu News