Gandhi: గాంధీజీ మరణంపై వివాదాస్పద బుక్ లెట్ ప్రచురించిన ఒడిశా ప్రభుత్వం

  • మహాత్ముడు ఓ ప్రమాదంలో చనిపోయారంటూ కథనం
  • ఆమా బాపూజీ పేరిట రెండు పేజీల బుక్ లెట్ విడుదల
  • విచారణకు ఆదేశించామన్న ఒడిశా విద్యాశాఖ మంత్రి

జాతిపిత మహాత్మాగాంధీని నాథూరాం గాడ్సే కాల్చి చంపిన విషయం అందరికీ తెలిసిందే. అయితే, ఒడిశా విద్యాశాఖ తాజాగా గాంధీజీ ఓ ప్రమాదంలో చనిపోయారంటూ ప్రచురించి వివాదానికి కారణమైంది. 'ఆమా బాపూజీ: ఏక్ ఝలకా' అనే రెండు పేజీల బుక్ లెట్ లో గాంధీజీ ఓ ప్రమాదంలో కన్నుమూశారని పేర్కొనడమే కాకుండా, ఎలా చనిపోయారో వివరించారు. దాంతో అన్ని వైపుల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి.

హత్యను ప్రమాదంగా పేర్కొనడం ఏంటి అంటూ పలువురు మండిపడుతున్నారు. గాడ్సే చేతిలో మహాత్ముడు చనిపోయాడన్న నిజాన్ని దాచి, ఇలాంటి తప్పుడు కథనాలతో భవిష్యత్ తరాలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.

దీనిపై ఒడిశా విద్యాశాఖ మంత్రి సమీర్ రంజన్ దాస్ మాట్లాడుతూ, ఈ వివాదాస్పద అంశం బుక్ లెట్ లో ఎలా వచ్చిందో తెలుసుకునేందుకు విచారణకు ఆదేశించామని వెల్లడించారు. అంతేకాదు, బుక్ లెట్ ను ప్రభుత్వం ఉపసంహరించుకుందని తెలిపారు.

More Telugu News