Crime News: చుట్టపు చూపుగా వచ్చిన బావమరిది.. పాత కక్షతో హత్య చేసిన బావ!

  • దంపతుల వివాదంలో జోక్యం చేసుకున్న తమ్ముడు
  • ఏడాది క్రితం అక్క కాపురాన్ని చక్కదిద్దిన వైనం
  • ఆ సందర్భంలో పోలీసులకు ఫిర్యాదు చేశాడని ఆగ్రహం

అక్క కాపురంలో స్పర్థలు మొదలై పరిస్థితి క్లిష్టంగా మారడంతో ఆ కాపురాన్ని చక్కదిద్దేందుకు ఏడాది క్రితం ఆమె తమ్ముడు రంగంలోకి దిగాడు. ఈ సందర్భంగా పోలీసులు, పెద్దల వద్దకు వెళ్లి ఫిర్యాదులు అందించాడు. న్యాయం చేయాలని అభ్యర్థించాడు. కలిసి చక్కగా కాపురం చేసుకోవాలని బావకు సర్దిచెప్పాడు. అదే అతను చేసిన పొరపాటైంది. ప్రాణాల మీదికి తెచ్చింది.


వివరాల్లోకి వెళితే, ఆదిలాబాద్ పట్టణం ఖుర్షీద్ నగర్ కాలనీకి చెందిన ఓసావార్ సంతోష్, మమత దంపతులు. పద్నాలుగేళ్ల క్రితం వీరి పెళ్లి జరగగా పాప, బాబు ఉన్నారు. మమత తమ్ముడు మనోజ్ (27) ఉద్యోగ రీత్యా మహారాష్ట్రలోని దహెల్లిలో ఉంటున్నాడు. స్థానిక జిన్నింగ్ మిల్లులో పనిచేస్తున్న సంతోష్ కు, మమతకు మధ్య ఏడాది క్రితం మనస్పర్థలు మొదలయ్యాయి. నిత్యం గొడవలు జరుగుతుండేవి. 


భర్త తీరుతో విసిగిపోయిన మమత పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో అక్కాబావల కాపురాన్ని చక్కదిద్దేందుకు మమత తమ్ముడు మనోజ్ జోక్యం చేసుకున్నాడు. సమస్యను పెద్దల దృష్టికి తీసుకువెళ్లడం, పోలీసులకు ఫిర్యాదు చేయడం చేశాడు.


దీంతో చాలా రోజులపాటు పోలీసుల కౌన్సెలింగ్, పెద్దల పంచాయతీలు జరిగాయి. మొత్తమ్మీద వ్యవహారం చక్కబడింది. తాను మారిపోయానని, ఇకపై ఎటువంటి గొడవలు పడనని చెప్పిన సంతోష్ దహెల్లిలో తమ్ముడి ఇంట్లో ఉన్న భార్య పిల్లలను రప్పించుకున్నాడు. ఆ తర్వాత కూడా మమత ఎప్పటికప్పుడు తన ఇంటి విషయాలు ఫోన్లో తమ్ముడికి చెబుతుండడం సంతోష్ కు నచ్చలేదు. దీంతో అతనిపై కక్ష పెంచుకున్నాడు.


ఈ నేపథ్యంలో నిన్న పని నిమిత్తం స్నేహితుడు సంజీవ్ తో కలిసి మనోజ్ ఆదిలాబాద్ వచ్చాడు. మనోజ్ ను చూడగానే సంతోష్ లోని పాతకక్ష మొగ్గ తొడిగింది. దీంతో టీ తాగివద్దాం పదని చెప్పి మనోజ్ ను వెంట తీసుకువెళ్లాడు. కాస్త దూరం వెళ్లాక అప్పటికే తన వెంట తెచ్చుకున్న కత్తితో పొడవబోగా తప్పించుకున్న మనోజ్ పారిపోయాడు. దీంతో వెంటపడి అతని గొంతుకోసి చంపేశాడు.


ఈ ఘటనతో ఆశ్చర్యపోయిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి పరిశీలించగా అప్పటికే మనోజ్ చనిపోయాడు.

More Telugu News