Chandrababu: ఏపీ రాజకీయాల్లో పెద్ద కుదుపు రాబోతోంది: వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు

  • సీఎస్ గా నీలం సాహ్ని రావడం ఈ కుదుపునకు సంకేతం
  • త్వరలో ఐఏఎస్ శ్రీలక్ష్మి కూడా ఏపీకి రాబోతున్నారు
  • జైల్లో చిప్పకూడు తిన్న వ్యక్తి మా ముఖ్యమంత్రి

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చేపట్టిన ఇసుక దీక్ష ముగింపు సందర్భంగా నిర్వహించిన సభలో వర్ల రామయ్య మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రానున్న ఆరు నెలల్లో ఏపీ రాజకీయాల్లో పెద్ద కుదుపు రాబోతోందని జోస్యం చెప్పారు. ఏపీ సీఎస్ గా నీలం సాహ్ని రావడం రాజకీయాల్లో రానున్న కుదుపునకు సంకేతంగా చెప్పారు. త్వరలో ఐఏఎస్ శ్రీలక్ష్మి కూడా ఏపీకి రాబోతున్నారని అన్నారు.

16 నెలలు చంచలగూడ జైల్లో ఉన్న వ్యక్తి జగన్

ఏపీ సీఎం జగన్ పై వర్ల రామయ్య తీవ్ర విమర్శలు చేశారు. ‘మీ అందరిని ఒక ప్రశ్న అడుగుతున్నా.. మన చీఫ్ మినిస్టర్ ఎవరు ఈరోజున?’ అని ప్రశ్నించగా సమాధానం రాకపోవడంతో ‘ఏమయ్యా, పేరు చెప్పడానికి కూడా ఇష్టపడటం లేదే మీరు.. మిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యాజ్ ఆన్ టుడే. ఆయన గురించి రెండు మాటలు చెప్పండని ఎవరైనా అడిగితే.. తండ్రి ముఖ్యమంత్రిత్వాన్ని అడ్డుపెట్టుకుని, లక్ష కోట్లు దండుకుని, చట్టానికి చిక్కి, సీబీఐతో అరెస్టు కాబడి,16 నెలలు చంచలగూడ జైల్లో చిప్పకూడు తిన్న వ్యక్తి మా ముఖ్యమంత్రి’ అంటూ విమర్శించారు. ‘ఈనాటి ముఖ్యమంత్రికి ఒక ఘన చరిత్ర ఉన్నది. ‘నేరస్థుడిగా 11 ఛార్జిషీట్లు ఎదుర్కొంటున్న వ్యక్తి మన మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారు’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

More Telugu News