Rahul Gandhi: సుప్రీంకోర్టు తీర్పు రాహుల్ గాంధీకి ఎదురు దెబ్బలాంటిది: జీవీఎల్

  • మోదీపై చేస్తోన్న వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తిరస్కరించింది
  • రాహుల్ ను ప్రజలు తిరస్కరించారు
  • రాహుల్ ని సుప్రీంకోర్టు మందలించింది

ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వంటి రాజకీయ నేతలు చేస్తోన్న వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తిరస్కరించిందని బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు అన్నారు. ప్రధాని మోదీకి రెండు విజయాలు దక్కాయని అన్నారు. కొన్ని నెలల క్రితం జరిగిన లోక్ సభ ఫలితాల్లో క్లీన్ స్వీప్ చేశారని, అలాగే, న్యాయస్థానం నుంచి క్లీన్ చిట్ వచ్చిందని గుర్తు చేశారు. మరోవైపు రాహుల్ కి రెండు ఎదురు దెబ్బలు తగిలాయని అన్నారు. ఆయనను ప్రజలు తిరస్కరించారని, సుప్రీంకోర్టు మందలించిందని విమర్శించారు. ఈ తీర్పు రాహుల్  గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బలాంటిదని అన్నారు. ఆయన మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తారని భావిస్తున్నానని చెప్పారు.
 
సుప్రీంకోర్టు తీర్పుపై బీజేపీ నేత అమిత్ మాలవీయ స్పందిస్తూ.. రాహుల్ గాంధీ చెప్పిన అసత్యాలను ప్రజలందరూ తిరస్కరించారని, ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా అన్ని రివ్యూ పిటిషన్లను కొట్టివేసిందని అన్నారు. బీజేపీ అధికార ప్రతినిధి షానవాజ్ హుసేన్ స్పందిస్తూ... సత్యమే విజయం సాధిస్తుందని, సత్యాన్ని బాధపెట్టగలరేమో గానీ ఓడించలేరని చెప్పుకొచ్చారు.

More Telugu News