Tamilnadu: రైలు పట్టాలపై పార్టీ... నలుగురు ఇంజనీరింగ్ విద్యార్థుల దుర్మరణం!

  • తమిళనాడులోని కోయంబత్తూరులో ఘటన
  • దూసుకొచ్చిన చెన్నై - అలప్పుంజా ఎక్స్ ప్రెస్
  • ఓ విద్యార్థికి తీవ్రగాయాలు

వారు నలుగురూ స్నేహితులు. ఇంజనీరింగ్ చదువుతున్నారు. అందరూ కలిసి పార్టీ చేసుకోవాలని భావించారు. జనాలు పెద్దగా తిరగని రైలు పట్టాలను ఎంచుకున్నారు. పార్టీ చేసుకుంటూ, పూటుగా తాగిన సమయంలో వేగంగా వచ్చిన రైలు నలుగురి ప్రాణాలనూ బలిగొంది.

ఈ ఘటన తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, ఇక్కడి ఓ ప్రైవేటు కాలేజీలో చదువుతున్న సిద్ధిఖ్ రాజా (22), రాజశేఖర్ (20), గౌతమ్ (23), కురుస్వామి (24), విఘ్నేశ్ లు రౌతర్ పాలం రైల్ ఓవర్‌ బ్రిడ్జి వద్ద పార్టీ చేసుకున్నారు.

ఆ సమయంలో చెన్నై - అల్లప్పుంజా ఎక్స్‌ ప్రెస్ రైలు అదే పట్టాలపై దూసుకొచ్చింది. రైలును వారెవరూ గమనించలేదు. విఘ్నేశ్ మినహా మిగతా నలుగురిపై నుంచి రైలు దూసుకెళ్లడంతో, వారంతా అక్కడికక్కడే మరణించారు. విఘ్నేశ్ కు తీవ్ర గాయాలు కావడంతో, చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలి వద్ద మద్యం బాటిల్స్, ప్లాస్టిక్ కప్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు, కేసును దర్యాఫ్తు చేస్తున్నామని తెలిపారు.

More Telugu News