Congress: బీజేపీలో చేరిన 15 మంది కాంగ్రెస్, జేడీఎస్ రెబల్ నేతలు

  • కర్ణాటక ఎన్నికల అనంతరం పార్టీ ఫిరాయించిన కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు
  • అనర్హత వేటు ఎత్తేస్తూ నిన్న సుప్రీంకోర్టు తీర్పు
  • యడియూరప్ప ఆధ్వర్యంలో బీజేపీలో చేరిన నేతలు

కర్ణాటకలో శాసనసభ ఎన్నికల అనంతరం పార్టీ ఫిరాయించిన 17 మంది కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలకు ఊరటనిస్తూ సుప్రీంకోర్టు నిన్న తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. స్పీకర్ నిర్ణయంతో అనర్హత వేటు పడ్డ ఆ 17 మంది.. ఉప ఎన్నికల్లో పోటీ చేయవచ్చని తెలిపింది. దీంతో ఆ 17 మందిలో 15 మంది ఈ రోజు బీజేపీలో చేరారు.

కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ఆధ్వర్యంలో వారు ఈ రోజు బీజేపీ కండువా కప్పుకున్నారు. వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు యడియూరప్ప తెలిపారు. కర్ణాటకలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు త్వరలోనే ఉపఎన్నికలు జరగబోతున్నాయి. కాగా, ఈ కార్యక్రమానికి ముందు యడియూరప్ప.. మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా తమ పార్టీ నేతలతో కలిసి ఆయనకు నివాళులర్పించారు.

More Telugu News