Chandrababu: ఐదేళ్లు ఇసుక మాఫియాను నడిపించిన చంద్రబాబు దీక్ష చేయడం హాస్యాస్పదం: ఏపీ మంత్రి పెద్దిరెడ్డి

  • ఇవి నిస్సిగ్గు రాజకీయాలు
  • ఈ నాటకాలను ప్రజలు విశ్వసించరు
  • తమ పాలనలో ఎక్కడా ఇసుక మాఫియా లేదని స్పష్టీకరణ

అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఐదేళ్లపాటు రాష్ట్రంలో ఇసుక మాఫియాను నడిపించిన చంద్రబాబునాయుడు ఇప్పుడు కూలీల పేరుతో మొసలికన్నీరు కారుస్తూ దీక్షకు కూర్చోవడం హాస్యాస్పదమని ఏపీ రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఘాటు విమర్శలు చేశారు.


బాబువి నిస్సిగ్గు రాజకీయాలని, ఇటువంటి నాటకాలను తెలుగు ప్రజలు విశ్వసించరని ఎద్దేవా చేశారు. విజయవాడలో బాబు దీక్ష నేపథ్యంలో ఆయన మాట్లాడారు. తప్పుడు చార్జిషీట్ విడుదల చేసి చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని, వైసీపీ పాలనలో ఎక్కడా ఇసుక మాఫియా లేదని గుర్తు చేశారు. ఇలాగే వ్యవహరిస్తే చంద్రబాబు గ్రామాల్లో కూడా తిరిగే పరిస్థితి ఉండదని తెలిపారు. 


వరదల కారణంగా ఇన్నాళ్లు ఇసుక కొరత ఉన్నా గత కొన్ని రోజుల నుంచి పుష్కలంగా లభిస్తోందని చెప్పుకొచ్చారు. సగటున రోజుకి లక్షన్నర టన్నుల ఇసుక అందుబాటులోకి వచ్చిందని, ప్రస్తుతం రోజుకి రెండు లక్షల టన్నులు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు.

More Telugu News