Devineni avinash: 'తెలుగు యువత'కు షాక్... జగన్ సమక్షంలో నేడు వైసీపీలోకి దేవినేని అవినాశ్!

  • అవినాశ్ తో పాటు కడియాల బుచ్చిబాబు కూడా
  • పార్టీలో గుర్తింపులేదన్న అవినాశ్
  • కార్యకర్తల అభీష్టం మేరకే నిర్ణయమని వెల్లడి

ఆంధ్రప్రదేశ్ తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాశ్‌, వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. నిన్న రాత్రి గుణదలలోని తన నివాసంలో అనుచరులతో, దేవినేని నెహ్రూ అభిమానులతో చర్చలు జరిపిన ఆయన, పార్టీ మారనున్న విషయాన్ని ఖరారు చేశారు.

 చంద్రబాబు మాటకు కట్టుబడి, ఎంత కష్టించి పనిచేసినా, తనకు తగిన గుర్తింపు రావడం లేదని ఈ సందర్భంగా అనినాశ్ వ్యాఖ్యానించారు. పార్టీలో ప్రాధాన్యం దక్కకుండా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కార్యకర్తల అభీష్టం మేరకే తాను వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నానని వెల్లడించారు. కాగా, అవినాశ్ తో పాటు కడియాల బుచ్చిబాబు కూడా వైసీపీలో చేరతారని తెలుస్తోంది. గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో అవినాశ్ గుడివాడ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ పడి ఓటమిపాలైన సంగతి తెలిసిందే.

నేటి సాయంత్రం 4 గంటలకు వైఎస్ జగన్ ను కలవనున్న అవినాశ్, పార్టీ కండువాను కప్పుకోనున్నారని తెలుస్తోంది. ఇక అవినాశ్ కు విజయవాడ తూర్పు నియోజకవర్గం ఇన్ చార్జ్ గా బాధ్యతలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

More Telugu News