Green India: ఈ ఛాలెంజ్ ను యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు ఇస్తున్నా: యాంకర్ సుమ

  • ‘గ్రీన్ ఇండియా’ ఛాలెంజ్ స్వీకరించిన సుమ
  • మూడు మొక్కలు నాటిన వైనం
  • మంచు లక్ష్మి, రాహుల్ సిప్లి గంజ్, యాంకర్ ఓంకార్ కీ ఛాలెంజ్ విసిరిన సుమ

టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ‘గ్రీన్ ఇండియా’ ఛాలెంజ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే ఎంతో మంది రాజకీయ, సినీ తదితర రంగాల ప్రముఖులు మొక్కలు నాటారు. తాజాగా, యాంకర్, నటి సుమ ఈ ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటింది. హైదరాబాద్, బేగంపేటలోని మయూరి బిల్డింగ్ ప్రాంగణంలో ఈరోజు మూడు మొక్కలు నాటింది.

ఈ సందర్భంగా సెలబ్రిటీలు జూనియర్ ఎన్టీఆర్, మంచు లక్ష్మి, బిగ్ బాస్ (తెలుగు) సీజన్-3 విజేత రాహుల్ సిప్లిగంజ్, యాంకర్ ఓంకార్ కు ఆమె ‘గ్రీన్ ఛాలెంజ్’ విసిరింది. అనంతరం, మీడియాతో సుమ మాట్లాడుతూ, ఇలాంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చిన సంతోష్ కుమార్ కు, ‘హరితహారం’లో భాగంగా ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్న సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి తన శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టు పేర్కొంది.

‘నిండుదనంతో పచ్చదనం’ ప్రాజెక్టులో భాగంగా తనకు ఛాలెంజ్ విసిరిన సినీ నటి జయసుధకు తన ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు చెప్పారు. ఈ మొక్కల ఛాలెంజ్ ఇలాగే కొనసాగాలని అభిప్రాయపడ్డారు. ‘నేను ఈ ఛాలెంజ్ ఎవరికిస్తున్నానంటే.. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గారికి, అలాగే, మంచు లక్ష్మి గారికి, బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లి గంజ్, యాంకరింగ్ లో యూనివర్శల్ అన్నయ్య ఓంకార్ గారికి ఈ ఛాలెంజ్ ను ఇస్తున్నాను’ అని చెప్పింది. ‘మెుక్కలను నాటుదాం.. ప్రకృతిని అందంగా ఉంచుదాం.. మనం ఆనందంగా ఉందాం’ అని సుమ తెలిపింది.

More Telugu News