Rajasekhar: వాస్తవాలు అందరికీ తెలియాలి.. అసలు ఏం జరిగిందంటే..!: రాజశేఖర్ యాక్సిడెంట్ పై జీవిత స్పందన

  • టీవీల్లో, వెబ్ సైట్లలో రకరకాలు వార్తలు వస్తున్నాయి
  • టైరు పేలిపోవడంతో కారు డివైడర్ ను ఢీకొని అవతలి వైపుకు పడిపోయింది
  • పెద్ద యాక్సిడెంటే అయినా... అభిమానుల ప్రేమతో క్షేమంగా బయటపడ్డారు

తన భర్త రాజశేఖర్ కు జరిగిన రోడ్డు ప్రమాదంపై జీవిత స్పందించారు. యాక్సిడెంట్ కు సంబంధించి టీవీల్లో, వెబ్ సైట్లలో రకరకాల న్యూస్ వస్తోందని... వాస్తవాలు అందరికీ తెలియాల్సి ఉందని అన్నారు. రోడ్డు ప్రమాదానికి సంబంధించి ఓ వీడియో ద్వారా ఆమె పూర్తి వివరాలను వెల్లడించారు.

'వాస్తవంగా ఏం జరిగిందంటే... నిన్న రాత్రి 1.30 గంటల సమయంలో రామోజీ ఫిలిం సిటీ నుంచి బెంజ్ కారులో రాజశేఖర్ ఇంటికి వస్తున్నారు. ఆ సమయంలో టైరు పేలిపోవడంతో, డివైడర్ ను కారు ఢీకొని, అవతలి వైపుకు పడిపోయింది. సరిగ్గా అదే సమయంలో అటువైపు ఎదురుగా వస్తున్న కారులో ఉన్న వ్యక్తులు... యాక్సిడెంట్ కు గురైన వాహనం వద్దకు వచ్చారు. వారు రాజశేఖర్ ను గుర్తుపట్టారు. వారి సహాయంతో రాజశేఖర్ కారు నుంచి బయటకు వచ్చారు.

ప్రమాదం కారణంగా రాజశేఖర్ ఫోన్ పని చేయలేదు. దీంతో, తనకు ఎవరైతే సాయం చేశారో వారి ఫోన్ నుంచే పోలీసులకు, మాకు ఫోన్ చేశారు. జరిగిన ప్రమాదం గురించి చెప్పారు. నేను వీళ్ల కారులోనే వస్తున్నానని, మీరు ఎదురుగా రండి అని చెప్పారు. ఆయన చెప్పిన విధంగానే మేము సగం దూరం వెళ్లి, ఆయనను కారులో ఇంటికి తీసుకొచ్చాం. ఆ తర్వాత పోలీసులతో కూడా మేము టచ్ లో ఉన్నాము.

ఇంటికి వచ్చిన తర్వాత డాక్టర్ వచ్చి పరీక్షించారు. రాజశేఖర్ పర్ఫెక్ట్ లీ ఆల్ రైట్ అని చెప్పారు. చిన్న స్క్రాచ్ తప్ప ఎలాంటి దెబ్బలు తగల్లేదని అన్నారు. ఫస్ట్ ఎయిడ్ చేసి, నొప్పుల కోసం పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ ఇచ్చి డాక్టర్ వెళ్లిపోయారు. ఆ తర్వాత కూడా పోలీసులతో నేను మాట్లాడుతూనే ఉన్నాను. రాజశేఖర్ గారు కొంచెం బెటర్ గా ఫీల్ అయినప్పుడు వీలు చూసుకుని స్టేషన్ కు వచ్చి, స్టేట్ మెంట్ ఇవ్వండని పోలీసులు చెప్పారు. స్టేషన్ కు వస్తామని నేను చెప్పాను.

జరిగింది ఇది. వాస్తవానికి ఇది మేజర్ యాక్సిడెంట్. కానీ, అభిమానుల ప్రేమాభిమానాలతో ఆయన క్షేమంగా బయటపడ్డారు. మా పట్ల ఇంత ప్రేమను పంచుతున్న అందరికీ కృతజ్ఞతలు' అంటూ జీవిత పూర్తి వివరాలను వెల్లడించారు.

More Telugu News