Warangal Rural District: వేధింపులు భరించలేక కన్న కొడుకునే సజీవ దహనం చేసిన తల్లిదండ్రులు

  • కట్టేసి కిరోసిన్ పోసి నిప్పంటించిన వైనం
  • మద్యం మత్తులో పెడుతున్న హింస భరించలేక నిర్ణయం
  • భర్త వేధింపులు భరించలేక పుట్టింటికి వెళ్లిపోయిన భార్య

పున్నామ నరకం నుంచి తమను తప్పిస్తాడని కలలు గన్న ఆ తల్లిదండ్రులకు నిత్యం ఇంట్లోనే నరకం చూపిస్తున్న కొడుకు తీరు కడుపు తీపిని కూడా చంపుకునేలా చేసింది. మద్యం మత్తులో ఇంట్లోనే తమను చిత్రహింసలు పెడుతుండడంతో భరించలేక సజీవ దహనం చేశారు. విస్తుగొలిపే ఈ ఘటన వరంగల్ రూరల్ జిల్లా దామెర మండలం ముస్త్యాలపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. 


పోలీసులు తెలిపిన వివరాలు ఇలావున్నాయి. గ్రామానికి చెందిన కడారి మహేష్ చంద్ర (42) ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మద్యానికి బానిసైన చంద్ర నిత్యం పెట్టే వేధింపులు భరించలేక రెండు నెలల క్రితమే భార్య పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయంది.


అయినా మహేష్ చంద్రలో పశ్చాత్తాపం కలగలేదు. నిత్యం మద్యం మత్తులో ఉండే మహేష్ చంద్ర తన తల్లిదండ్రులు కడారి ప్రభాకర్, విమలలను కూడా వేధిస్తుండే వాడు. రోజూ తాగివచ్చి కొడుతున్న కొడుకు తీరును తట్టుకోలేకపోయారు. నిన్నరాత్రి ఎప్పటిలాగే తాగివచ్చిన కొడుకు తమమీద చెయ్యి చేసుకోవడంతో ప్రభాకర్ దంపతులు ఎదురు తిరిగారు.


అతన్ని పట్టుకుని కట్టేశారు. అనంతరం ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. విషయం తెలిసి స్థానికులు వచ్చేసరికే మహేష్ చంద్ర సజీవ దహనం అయ్యాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

More Telugu News