Bollywood: బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, రోహిత్ శెట్టి కొట్టుకున్నారంటూ బ్రేకింగ్ న్యూస్.. నిజంగానే కొట్టుకుని వార్తను ఖండించిన వైనం!

  • బ్రేకింగ్ న్యూస్‌తో కథనం రాసిన ‘బాలీవుడ్ హంగామా’
  • సెట్‌లో ఒకరిపై ఒకరి పడి కుమ్మేసుకున్న హీరో, దర్శకుడు
  • అక్షయ్ క్రియేటివిటీకి నెటిజన్ల ప్రశంసల జల్లు

బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ ‘సూర్యవంశీ’ అనే సినిమాలో నటిస్తున్నాడు. రోహిత్‌శెట్టి దర్శకత్వం వహిస్తున్నాడు. కత్రినా కైఫ్ హీరోయిన్. రోహిత్‌శెట్టి, కరణ్ జొహార్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా షూటింగులో అక్షయ్ కుమార్, డైరెక్టర్ రోహిత్‌శెట్టి మధ్య జరిగిన గొడవ కొట్టుకునేంత వరకు వెళ్లిందంటూ ‘బాలీవుడ్ హంగామా’ అనే వెబ్‌సైట్ కథనం రాసింది. వీరిద్దరి మధ్య రాజీ కుదిర్చేందుకు కరణ్ జొహార్ ప్రయత్నిస్తున్నట్టు బ్రేకింగ్ న్యూస్ పెట్టి మరీ వార్త రాసింది.

ఈ వార్త విపరీతంగా వైరల్ అయి చివరికి అక్షయ్ కుమార్‌ వద్దకు చేరింది. దీంతో ఆ వార్త రాసిన వెబ్‌సైట్‌కు దిమ్మదిరిగే రిప్లై ఇచ్చాడు. కత్రినా కైఫ్, రోహిత్‌శెట్టిలతో కలిసి ఓ చక్కని డ్రామాను సృష్టించి అక్షయ్ ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. ఇప్పుడది తెగ వైరల్ అవడమే కాదు.. తప్పుడు వార్త ప్రచురించిన వెబ్‌సైట్‌పై నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. ఆ వీడియో ప్రకారం.. వెబ్‌సైట్‌లో వచ్చిన వార్తను కత్రినా తొలుత తన స్మార్ట్‌ఫోన్‌లో చూపించింది. అనంతరం.. ‘‘ఈ వార్త ప్రకారం వారిద్దరూ కొట్టుకోవాలిగా.. చూడండి, నిజంగానే కొట్టుకుంటున్నారు’’ అని చూపించింది.

ఆ వెంటనే ఓ వైపు తలుపు తోసుకుని రోహిత్ శెట్టి, మరో తలుపు తోసుకుని అక్షయ్ కుమార్ దూసుకొచ్చారు. వచ్చీ రావడమే ఇద్దరూ ఒకరిపై ఒకరు పడి కొట్టుకున్నారు. అక్కడే ఉన్న యూనిట్ సభ్యులు వారిద్దరినీ విడిపించే ప్రయత్నం చేశారు. ఇక కొట్టుకుని అలసిపోయిన అక్షయ్, రోహిత్‌లు ఇద్దరూ కిందపడిపోయారు. ‘సూర్యవంశీ’ సెట్‌లోనే దీనిని షూట్ చేసి పోస్టు చేశారు. తమపై వచ్చిన వార్తను అక్షయ్ కుమార్ ఖండించిన తీరు, అతడి క్రియేటివిటీకి నెటిజన్లు అబ్బురపడుతున్నాడు. ప్రశంసల వర్షంతో అక్షయ్‌ను తడిపేస్తున్నారు.

More Telugu News