Jammu And Kashmir: జమ్మూకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలోకి దూసుకెళ్లిన వాహనం.. 16 మంది మృతి

  • ప్రయాణికులతో వెళ్తున్న వాహనం
  • దోడా జిల్లాలో  అదుపు తప్పి లోయలోకి
  • చావుబతుకుల్లో ఒకరు

జమ్మూకశ్మీర్‌లో నిన్న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒకే ఒక్కరు ప్రాణాలతో బయటపడగా, అతడి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ప్రయాణికులతో వెళ్తున్న ఓ వాహనం దోడా జిల్లా మర్మాట్ ప్రాంతంలో అదుపు తప్పి 700 మీటర్ల లోతున్న లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 12 మంది అక్కడికక్కడే చనిపోయారు. మరో నలుగురు చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు.

ప్రాణాలతో బయటపడిన ఒకే ఒక్క వ్యక్తిని తొలుత స్థానిక ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం జమ్మూలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి కూడా విషమంగా ఉందని ఎస్పీ ముంతాజ్ అహ్మద్ తెలిపారు. వాహనంపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్లే ఈ ఘటన జరిగిందని తెలిపారు. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

More Telugu News