secunderabad: సికింద్రాబాద్‌లో భారీ చోరీ.. పెప్పర్ స్ప్రే చల్లి రూ.30 లక్షలు ఎత్తుకెళ్లిన దుండగులు

  • మహంకాళి ఆలయ సమీపంలో ఘటన
  • రూ. 30 లక్షలతో తమ షాపునకు బయలుదేరిన బాధితుడు
  • తమ షాపు వద్దే డబ్బు సంచి లాక్కుని పరారైన దుండగులు

సికింద్రాబాద్‌లో గత రాత్రి భారీ చోరీ జరిగింది. ఓ వ్యక్తి కళ్లలో పెప్పర్ స్ప్రే చల్లి అతడి వద్ద ఉన్న రూ.30 లక్షల సంచి లాక్కుని దుండగులు పరారయ్యారు. మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. మహంకాళి ఆలయ సమీపంలో రోహిత్ అనే నగల తయారీ దుకాణం, నవకార్ అనే నగల విక్రయ దుకాణాలు ఉన్నాయి. ఈ రెండు దుకాణాల మధ్య లావాదేవీలు ఉన్నాయి. రోహిత్ షాపు తయారు చేసే నగలను నవకార్ షాపు కొనుగోలు చేసి విక్రయిస్తుంటుంది.

ఈ క్రమంలో రోహిత్ షాపునకు చెందిన రూపారామ్ అనే వ్యక్తి నవకార్ నుంచి తమకు రావాల్సిన రూ.30 లక్షలను తీసుకుని షాపునకు బయలుదేరాడు. ఈ క్రమంలో తమ దుకాణం ఉన్న భవనం మెట్లు ఎక్కుతుండగా మొదటి అంతస్తు సెల్లార్‌లో వేచి ఉన్న దుండగులు రూపారామ్‌పై పెప్పర్ స్ప్రే చల్లి అతడి నుంచి డబ్బు సంచి లాక్కుని బైక్‌పై పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు.

More Telugu News