Jagan: నేనేమీ సరదాపడి మూడు పెళ్లిళ్లు చేసుకోలేదు... కావాలంటే మీరూ చేసుకోండి: జగన్ పై పవన్ ఫైర్

  • జగన్ వ్యాఖ్యలపై పవన్ రిప్లయ్
  • నా పెళ్లిళ్లపై మీకెందుకు బాధ అంటూ ఆగ్రహం
  • ఒక్క ఎమ్మెల్యే ఉన్న పార్టీని చూసి భయపడుతున్నారని వ్యాఖ్యలు

జనసేనాని పవన్ కల్యాణ్ సీఎం జగన్ పై విరుచుకుపడ్డారు. ప్రతిదానికి తనను మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడంటూ విమర్శిస్తున్నారని, తానేమీ సరదా కోసం మూడు పెళ్లిళ్లు చేసుకోలేదని, కుదర్లేదు కాబట్టే మూడు పెళ్లిళ్లు చేసుకున్నానని వివరణ ఇచ్చారు. అయినా నేను ఎన్ని పెళ్లిళ్లు చేసుకుంటే మీకెందుకు బాధ? కావాలంటే మీరూ చేసుకోండి అంటూ మండిపడ్డారు.

సామరస్య పూర్వక పద్ధతిలో సమస్యలు పరిష్కారించాలన్నది తమ పార్టీ అభిమతమని స్పష్టం చేశారు. అందరూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటే సమస్య మరుగున పడిపోతుందని, సద్విమర్శలు చేయడం తమ పార్టీ సంస్కృతి అని స్పష్టం చేశారు. కానీ వైసీపీ సంస్కృతి వ్యక్తిగత విమర్శలతో మీద పడిపోవడమేనని ఆరోపించారు.

మీరు వ్యాఖ్యలు చేస్తే టీడీపీ వాళ్లు పడతారేమో కానీ, జనసేన నేతలు పడరని ఘాటుగా బదులిచ్చారు. అబ్దుల్ కలాం పేరిట జరిగిన కార్యక్రమంలో మాట్లాడాల్సిన మాటలేనా అవి? అని ప్రశ్నించారు. 151 ఎమ్మెల్యేలున్న ఓ పార్టీ ఒక్క ఎమ్మెల్యే ఉన్న మరో పార్టీపై ఇంత ఘాటుగా వ్యాఖ్యలు చేయాల్సిన పనిలేదని, కానీ అలా చేస్తున్నారంటే జనసేన అంటే వైసీపీ భయపడుతున్నట్టే లెక్క అని భాష్యం చెప్పారు.

More Telugu News