Chiranjeevi: చిరంజీవిగారు మాట్లాడిన ఆ మూడు మాటలు చాలు: పరుచూరి గోపాలకృష్ణ

  • చిరంజీవిగారు చాలా బిజీగా వున్నారు 
  • రచయితలపట్ల గౌరవంతో వచ్చారు 
  • ఆయనకి ధన్యవాదాలు తెలుపుతున్నామన్న పరుచూరి 

ఇటీవల 'తెలుగు సినీ రచయితల సంఘం రజతోత్సవ వేడుకలు' జరిగాయి. ఆ వేదికపై చిరంజీవి మాట్లాడిన మాటలను గురించి, 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ ప్రస్తావించారు. "నవంబర్ 3వ తేదీన ఈ వేడుకను ఏర్పాటు చేసుకున్నాము. అదే రోజు రాత్రి చిరంజీవిగారు యూఎస్ వెళుతున్నారు. అయినా మా ఆహ్వానంపై గౌరవంతో ఈ వేడుకకి వచ్చారు.

ఈ వేదికపై ఆయన మూడు మాటలు మాట్లాడారు. 'దర్శక నిర్మాతల తరువాత నేను ప్రేమించేది రచయితలను. ఇంత అద్భుతమైన వేడుకకి నన్ను పిలిచి ఉండకపోతే నేను బాధపడే వాడిని' అని చిరంజీవి అన్నారు.'సింగీతం శ్రీనివాసరావుగారు .. కె.విశ్వనాథ్ గారు అనారోగ్య కారణాల వలన రాలేకపోయారని చెప్పారు. వాళ్లను ఎప్పుడు సన్మానించినా నన్ను ఆహ్వానించండి .. వాళ్లను సత్కరించుకుంటాను' అని చెప్పారు. చివరిగా .. రచయితలు లేనిదే మేము లేము' అన్నారు. రచయితలంతా సంతృప్తి చెందడానికి ఈ మూడు మాటలు చాలు. ఆయనకి ముక్తకంఠంతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాము" అని చెప్పుకొచ్చారు.

More Telugu News