Jana Sena: బతుకు దుర్భరమై ఇసుక కార్మికులు దయనీయ స్థితిలో జీవితాన్ని గడుపుతున్నారు: గవర్నర్‌కు తెలిపిన పవన్

  • భవన నిర్మాణ కార్మికులకు ఉపశమనం కలిగించేలా చర్యలు తీసుకోవాలి
  • రాష్ట్రంలో ఇసుక సరఫరాను పునరుద్ధరించాలి
  • తద్వారా వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలి

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో ఈ రోజు మధ్యాహ్నం జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ఏపీలో పెరిగిపోతోన్న భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలతో పాటు ఇసుక కొరత వంటి అంశాలపై  గవర్నర్‌కు పవన్ వినతిపత్రం ఇచ్చారు. గవర్నర్‌తో ఆయన దాదాపు అరగంట పాటు చర్చించినట్లు తెలుస్తోంది.

భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా రాష్ట్రంలో ఇసుక సరఫరాను పునరుద్ధరించాలని, తద్వారా వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలని పవన్ కోరారు. నూతన ఇసుక ప్రణాళికను వెంటనే ప్రవేశపెట్టాలని ఇటీవల జనసేన పార్టీ లాంగ్ మార్చ్ నిర్వహించిందని, అయినప్పటికీ ప్రభుత్వం సరైన రీతిలో స్పందించలేదని చెప్పారు. బతుకు దుర్భరమై దయనీయ స్థితిలో గడుపుతోన్న 35 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల వెతలను ఓ లేఖలో వివరిస్తూ గవర్నర్ కు పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా అందజేశారు.

ఏపీ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతున్న నేపథ్యంలో ఈ విషయంపై కూడా ఆయన గవర్నర్ తో చర్చించినట్లు తెలుస్తోంది. ఈ అంశాలపై ఏపీ ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ కొన్ని రోజులుగా విమర్శలు గుప్పిస్తోన్న విషయం తెలిసిందే.

More Telugu News