Jagan: సమస్యల పరిష్కారాలపై దృష్టి పెట్టండి: వైఎస్ జగన్ కు పురందేశ్వరి సూచన

  • ఏపీలో ఆంగ్లమాధ్యమం తప్పనిసరిపై విమర్శలు
  • ప్రశ్నిస్తున్న వారిపై విమర్శలు చేయకండి
  • మన సాహిత్యంలోనే మన సంస్కృతి ఉంది
  • మన సంస్కృతిని మనం కోల్పోయే ప్రమాదం ఉంది

ప్రజల సమస్యలపై గళం ఎత్తుతోన్న నేతలే లక్ష్యంగా ఎదురుదాడి చేస్తూ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి విమర్శలు గుప్పించడం సరికాదని బీజేపీ నాయకురాలు పురందేశ్వరి అన్నారు. వారిపై విమర్శలు చేయడానికి బదులు ప్రజల సమస్యలను తీర్చడంపై దృష్టిపెడితే బాగుంటుందని సీఎం జగన్ కి సూచించారు. ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధన తప్పనిసరి చేయడంపై ఆమె విమర్శలు గుప్పించారు.

ఇంగ్లిష్ ప్రపంచ వ్యాప్త భాష అని ప్రజలందరూ ఒప్పుకుంటారని పురందేశ్వరి అన్నారు. అయితే, మన మాతృభాషను నిర్లక్ష్యం చేస్తే, మన చరిత్రతో ముడిపడి ఉన్న మన మూలాలు తెగిపోతాయని అన్నారు. దీనివల్ల మన సంస్కృతిని మనం కోల్పోయే ప్రమాదం ఉందని స్పష్టంగా చెప్పవచ్చని తెలిపారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవడం ముఖ్యమని సూచించారు.

మన సాహిత్యంలోనే మన సంస్కృతి చాలా లోతుగా ఉందని, ప్రాంతీయ భాషలోనే ఈ సాహిత్యం అధికంగా ఉంటుందని పురందేశ్వరి చెప్పారు. మన భాషను మనుగడలో ఉంచుకోవడంతో మనం విఫలమైతే, మన భవిష్యత్ తరాలు ఈ గొప్ప సాహిత్యాన్ని అందుకోలేకపోతాయని, మన మూలాలను మనం కోల్పోతామని అన్నారు.

మాతృభాష ప్రాధాన్యత ఎనలేనిదని, చిన్నారులు తమ మాతృభాషలోనే ఆలోచిస్తారని పురందేశ్వరి చెప్పారు. పాఠశాలల్లో విద్యార్థులకు ఆంగ్ల భాషలో బోధన అందించే ముందు ఉపాధ్యాయులకు ఆ భాషలో శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయులు వ్యాకరణ దోషాలు లేకుండా కనీసం రెండు వాక్యాలు కూడా ఇంగ్లిషులో మాట్లాడలేరని అన్నారు. వారు విద్యార్థులకు ఆంగ్లభాషలో బోధన ఎలా చేస్తారని ప్రశ్నించారు.

విద్యార్థులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటారని, చదువును మానేసే వారి సంఖ్య పెరిగిపోతుందని పురందేశ్వరి ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి అనేక విషయాలకు ప్రభుత్వం సమాధానాలు చెప్పాల్సి ఉందని విమర్శించారు. వీటిపై ప్రశ్నిస్తున్న వారిపై ఎదురుదాడికి దిగడం మానేసి ఈ సవాళ్లను ఎలా ఎదుర్కోవాలనే విషయంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని ఆమె సూచించారు.

More Telugu News