SpiceJet: విజయవాడ - ముంబై స్పైస్ జెట్ విమానం డైలీ సర్వీస్ రద్దు!

  • 85 శాతం వరకూ ఆక్యుపెన్సీ
  • అయినా రద్దు చేయడంపై విమర్శలు
  • ఇక వారంలో మూడు రోజులు మాత్రమే ముంబైకి డైరెక్ట్ ఫ్లయిట్

సుమారు 85 శాతం మేరకు ఆక్యుపెన్సీ ఉన్నప్పటికీ, విజయవాడ నుంచి ముంబైకి నిత్యమూ నడిచే సర్వీసును స్పైస్ జెట్ ఉపసంహరించుకుంది. ప్రతి రోజూ మధ్యాహ్నం సమయంలో గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ఈ విమానం బయలుదేరుతుండగా, చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన ఎంతో మంది పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు, ప్రముఖులు ఈ సర్వీసును వాడుకుంటున్నారు. ఇప్పుడు ఒక్కసారిగా దీన్ని రద్దు చేయడంతో, ఇకపై విజయవాడ నుంచి ముంబైకి వారంలో మూడు రోజులు మాత్రమే డైరెక్ట్ ఫ్లయిట్ సర్వీస్ నడవనుంది.

వాస్తవానికి పూర్తి సంక్షోభంలో కూరుకుపోయిన వేళ, జెట్ ఎయిర్ వేస్, పలు నగరాలకు సర్వీసులను రద్దు చేయగా, విజయవాడ - ముంబై స్లాట్ ఆ సంస్థకు లభించింది. 140 సీట్లు ఉన్న విమానాన్ని సంస్థ నడపగా, రోజూ 100 మందికి పైగానే ప్రయాణికులు దీనిలో ప్రయాణించేవారు. మంచి ఆక్యుపెన్సీ ఉన్నప్పటికీ, ఇలా విమాన సర్వీసును రద్దు చేయడంపై ప్రయాణికుల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఇక రద్దయిన సర్వీసును రాజ్ కోట్ కు కేటాయించినట్టు స్పైస్ జెట్ వెల్లడించింది.

More Telugu News