Sonia Gandhi: రంజుగా మారిన ‘మహా’ రాజకీయం.. సోనియాగాంధీతో కోర్‌కమిటీ సమావేశం

  • శివసేనకు మద్దతు విషయంలో తేల్చుకోలేకపోయిన కాంగ్రెస్
  • ఈ ఉదయం పది గంటలకు సోనియా నివాసంలో సమావేశం
  • సమావేశం అనంతరం నిర్ణయాన్ని ప్రకటించనున్న ఎన్సీపీ

సోనియా గాంధీ నివాసంలో మరో గంటలో కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం కానుంది. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు తమకు సహకరించాల్సిందిగా సోనియాను శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే కోరారు. ఈ విషయంలో నిన్న సీడబ్ల్యూసీ సుదీర్ఘంగా చర్చించినప్పటికీ ఏ నిర్ణయమూ తీసుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో మద్దతుపై నిర్ణయం తీసుకునేందుకు ఈ ఉదయం పది గంటలకు మరోమారు సమావేశం కానున్నారు. మరోవైపు, ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్సీపీని గవర్నర్ ఆహ్వానించి నేటి సాయంత్రం వరకు గడువిచ్చారు.

దీంతో మిత్రపక్షమైన ఎన్సీపీ నేతలతో నేడు సమావేశమై తాజా పరిణామాలను చర్చించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. మద్దతు విషయమై ఈ రోజు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని నేతలు పట్టుదలగా ఉన్నట్టు సమాచారం. కాంగ్రెస్ అభిప్రాయం ఏమిటో స్పష్టమైన తర్వాతే ఎన్సీపీ తన నిర్ణయాన్ని వెల్లడిస్తుందని ఆ పార్టీ నేతలు తెలిపారు.

మరోవైపు, తమకు మద్దతు ఇచ్చేందుకు ముందుకు రాని కాంగ్రెస్‌కు శివసేన ఎందుకు మద్దతు ఇస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కాబట్టి ఏ రకంగా చూసినా మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశాలు లేవని తెగేసి చెబుతున్నారు. సాయంత్రం వరకు వేచి చూసి ఆ తర్వాత రాష్ట్రపతి పాలనకు గవర్నర్ సిఫారసు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

More Telugu News