Jagan: రాజ్యాంగ పదవిలో ఉన్న వెంకయ్యపై జగన్ వ్యాఖ్యలు దురదృష్టకరం: కన్నా

  • వెంకయ్య మనవళ్లు ఏ స్కూల్లో చదువుతున్నారన్న సీఎం జగన్
  • వెంకయ్యకు జగన్ క్షమాపణలు చెప్పాలన్న కన్నా
  • గతంలో జగన్ ఇంగ్లీషు మీడియంను వ్యతిరేకించారని విమర్శ 

ఏపీలో ఇసుక అంశానికి తోడు ఇంగ్లీషు మీడియం వ్యవహారం కూడా చర్చనీయాంశంగా మారింది. తనపై వస్తున్న విమర్శలను ఎదుర్కోవడంలో సీఎం జగన్ కాస్తంత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. "వెంకయ్యనాయుడు మనవళ్లు ఏ స్కూల్లో చదువుతున్నారో చెప్పాలి, ఆంధ్రజ్యోతి, ఈనాడులతో పాటు వెంకయ్యనాయుడు వంటి వాళ్లు ఇంగ్లీషు మీడియం పట్ల అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. పేదవాళ్లు ఇంగ్లీషు మీడియంలో చదవకూడదా?" అంటూ జగన్ వ్యాఖ్యానించారు. దీనిపై బీజేపీ ఏపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ స్పందించారు.

రాజ్యాంగ పదవుల్లో ఉన్న పెద్దల పట్ల ఇలా మాట్లాడడం మంచిది కాదని సీఎం జగన్ కు హితవు పలికారు. ఉపరాష్ట్రపతిగానే కాకుండా ఏ పదవిలో ఉన్నా ఏపీ అభివృద్ధికి కృషి చేసే వెంకయ్య లక్ష్యంగా జగన్ వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని అన్నారు. వెంకయ్యనాయుడుకు సీఎం జగన్ క్షమాపణలు చెప్పాల్సిందేనని కన్నా డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఇంగ్లీషు మీడియంను వ్యతిరేకించిన విషయాన్ని జగన్ మర్చిపోకూడదని తెలిపారు. మాతృభాషను చంపుతుంటే ఎవరూ చూస్తూ ఊరుకోరని స్పష్టం చేశారు.

More Telugu News