delivary: ఒకే కాన్పులో ముగ్గురు మగ పిల్లలు... ఓ ఆడపిల్ల

  • సిజేరియన్‌ చేసి బయటకు తీసిన వైద్యులు
  • తల్లీ బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని ప్రకటన
  • కర్ణాటక రాష్ట్రం హుబ్లీలో ఘటన

ఒకే కాన్పులో నలుగురు  పిల్లలకు జన్మనిచ్చిందో మహిళ. వీరిలో ముగ్గురు మగ పిల్లలు కాగా ఒకరు ఆడపిల్ల. సాధారణంగా కవలలు జన్మించడం అరుదుగా జరుగుతుంటుంది. ముగ్గురు పుడితే విశేషంగా చెప్పుకుంటారు. కానీ ఒకే కాన్పులో ఏకంగా నలుగురు పుట్టడంతో స్థానికంగా ఇది సంచలనమైంది.

కర్ణాటక రాష్ట్రం హుబ్లీలో జరిగిన ఈ విశేషానికి సంబంధించిన వివరాలు ఇవీ. హావేరి  జిల్లాలోని సవణూరు గ్రామానికి చెందిన మహబూబ్‌ బీ అనే గర్భిణికి నెలలు నిండడంతో కుటుంబ సభ్యులు హుబ్లీలోని కిమ్స్‌ ఆసుపత్రిలో చేర్పించారు. నిన్న ఆమెకు నొప్పులు రావడంతో వైద్య పరీక్షల నిమిత్తం ఉంచారు. పరిస్థితి పరిశీలించాక సాధారణ కాన్పు సాధ్యం కాదని భావించి సిజేరియన్‌ చేయాలని నిర్ణయించారు.

అయితే ఆపరేషన్‌ చేసిన వైద్యులు ఒక్కో బిడ్డను బయటకు తీస్తూ ఆశ్చర్యపోయారు. మొత్తం నలుగురు బిడ్డలు ఉండడం, ఒక్కో బిడ్డ రెండు కేజీల బరువుండడంతో అమితాశ్చర్యానికి లోనయ్యారు. ఇది కొంత విశేషమేనని, తల్లీ బిడ్డలు క్షేమంగా ఉన్నారని వైద్యులు ప్రకటించారు. మహబూబ్‌ బీకి తొలి కాన్పులో ఒక మగపిల్లాడు జన్మించాడు.

More Telugu News