Hyderabad: మద్యం మత్తులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ డ్రైవింగ్.. ఫ్లై ఓవర్‌పై కారు బీభత్సం.. ఇద్దరు యువకుల దుర్మరణం

  • నిందితుడు కాగ్నిజెంట్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్
  • స్నేహితులతో కలసి మద్యం తాగి కారులో ఇంటికి
  • బయోడైవర్సిటీ వద్ద మూడు బైక్‌లను ఢీకొట్టిన వైనం

పూటుగా మద్యం తాగి కారుతో ఫ్లై ఓవర్ ఎక్కిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ బీభత్సం సృష్టించాడు. ద్విచక్ర వాహనాలను ఢీకొట్టి ఇద్దరు యువకుల మృతికి కారణమయ్యాడు. హైదరాబాద్, రాయదుర్గం పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కూకట్‌పల్లికి చెందిన పి.అభిలాష్ (28) కాగ్నిజెంట్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. శనివారం స్నేహితులతో కలిసి మద్యం తాగి అర్ధరాత్రి కారులో రాయదుర్గం నుంచి మాదాపూర్ బయలుదేరాడు.

పూర్తిగా మద్యం మత్తులో ఉన్న అభిలాష్ బయోడైవర్సిటీ జంక్షన్‌ వద్ద ఫ్లై ఓవర్‌పై ముందు వెళ్తున్న మూడు బైక్‌లను ఢీకొట్టాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన ఎన్‌.సాయివంశీ రాజు(22), వి. ప్రవీణ్‌కుమార్‌(22)లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇదే ఘటనలో సాయికృష్ణ(21), పవన్‌కుమార్‌(19), పడాల మురళీకృష్ణ, గిరిధర్‌ సుభాష్‌(26) గాయపడ్డారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన సాయివంశీది వరంగల్ కాగా, ప్రవీణ్ కుమార్‌ది మహబూబ్‌నగర్‌గా గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News