Kakinada: కాకినాడలో వ్యక్తి ప్రాణం తీసిన రెండు రూపాయల వివాదం!

  • సైకిల్ కు గాలి కొట్టించుకున్న సువర్ణరాజు
  • రెండు రూపాయలు అడగటంతో గొడవ
  • సువర్ణరాజును కత్తితో పొడిచిన షాపు యజమాని స్నేహితుడు

తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ మండలం వలసపాకలో దారుణం జరిగింది. కేవలం రెండంటే, రెండు రూపాయల కోసం జరిగిన గొడవలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు వెల్లడించిన వివరాల్లోకి వెళితే, సాంబ అనే వ్యక్తి సైకిల్ షాపును నడుపుకుంటుండగా, సువర్ణరాజు అనే మరో వ్యక్తి తన సైకిల్ కు గాలి కొట్టించుకునేందుకు వచ్చాడు.

సైకిల్ కు గాలి కొట్టిన తరవాత రెండు రూపాయలు ఇవ్వాలని సాంబ కోరడంతో వివాదం మొదలైంది. తనను డబ్బులు అడుగుతావా? అంటూ సువర్ణరాజు సాంబపై దాడికి దిగడంతో, అదే దారిలో వస్తున్న సాంబ మిత్రుడు అప్పారావు, కల్పించుకుని సువర్ణరాజును కత్తితో పొడిచాడు. దీన్ని గమనించిన స్థానికులు సువర్ణరాజును కాకినాడ జీజీహెచ్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు, కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు ప్రారంభించారు.

More Telugu News