vinay kathiyar: మా తర్వాత అడుగులు కాశీ, మధురవైపు : మాజీ ఎంపీ వినయ్‌ కటియార్‌

  • బాబ్రీ కూల్చివేతలో కీలకంగా వ్యవహరించిన వినయ్‌
  • తాము జోక్యం చేసుకోమని స్పష్టం చేసిన ఆర్‌ఎస్‌ఎస్‌
  • వివాదాలు కాదు వ్యక్తిత్వ నిర్మాణానికే ప్రాధాన్యం అన్న చీఫ్‌ మోహన్ భాగవత్

అయోధ్య తీర్పు అనుకూలంగా రావడంతో ఇకపై కాశీ, మధురల్లోని వివాదాస్పద స్థలాలపై దృష్టిసారిస్తామని బీజేపీ మాజీ ఎంపీ, బాబ్రీ కూల్చివేతలో కీలకంగా వ్యవహరించిన వియయ్‌కటియార్‌ అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోకు చెందిన కటియార్‌  అయోధ్య తీర్పుపై స్పందిస్తూ తమ తదుపరి అడుగులు వారణాసిలోని కాశీవిశ్వనాథ దేవాలయం, మధురలోని శ్రీకృష్ణ మందిరాల వైపే పడనున్నాయని, ఈ సమస్యలపై దృష్టిసారిస్తామని తెలిపారు. వారణాసిలోని కాశీవిశ్వనాథుని ఆలయం, జ్ఞానవాసి మసీదు పక్కపక్కనే ఉంటాయి.

1669లో ఇక్కడి ఆలయాన్ని ధ్వంసం చేసి జ్ఞానవాసి మసీదు నిర్మించారన్నది వీరి వాదన. అలాగే, శ్రీకృష్ణుడి జన్మస్థలమైన మధురలోని శ్రీకృష్ణ జన్మభూమి దేవాలయం పక్కనే సాహీ ఈద్గా మసీదు ఉంది. కేశవనాథ్‌ దేవాలయాన్ని ధ్వంసం చేసి ఔరంగజేబ్‌ అక్కడ మసీదు నిర్మించాడన్నది మరో ఆరోపణ. ఈ వివాదాస్పద అంశాలనే కటియార్‌ ప్రస్తావిస్తూ తదుపరి తమ అడుగులు అటువైపే అని ప్రకటించాడు.

అయితే ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ దీనిపై భిన్నంగా స్పందించారు. ఈ అంశాల్లో తాము జోక్యం చేసుకోమని ఆయన స్పష్టం చేయడం విశేషం. ‘ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యక్తిత్వ నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తుంది తప్ప వివాదాలు రేపదు. అయోధ్య ఆందోళనల్లో మేం జోక్యం చేసుకోవడానికి అప్పట్లో పరిస్థితులు వేరేగా ఉన్నాయి. ఇప్పుడా పరిస్థితి లేదు. కావున కాశీ, మధుర వివాదాల్లో జోక్యం చేసుకోం’ అని స్పష్టం చేశారు.

More Telugu News