secunderabad: పెళ్లి చేసుకుంటావా.. యాసిడ్ పోయమంటావా?: యువతిని బెదిరించిన యువకుడి అరెస్ట్

  • బస్టాప్ పరిచయంతో పెళ్లి చేసుకోవాలని వేధింపులు
  • పెద్దల హెచ్చరికలతో కొంత కాలం దూరం
  • అరెస్ట్ చేసి రిమాండుకు తరలించిన పోలీసులు

తనను పెళ్లి చేసుకోకుంటే యాసిడ్ పోస్తానని బెదిరించిన యువకుడిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి కథనం ప్రకారం.. కూకట్‌పల్లికి చెందిన శ్రీనివాస్ (25) ఓ సివిల్ సర్వేయర్ దగ్గర పనిచేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన యువతి (20) సికింద్రాబాద్‌లోని ఓ దుకాణంలో పనిచేస్తోంది. సికింద్రాబాద్ బస్టాప్ వద్ద బస్సు కోసం వేచి చూసే సమయంలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత శ్రీనివాస్ ఆమెను ప్రేమ పేరుతో వేధించడం మొదలుపెట్టాడు.

అతడి వేధింపులు భరించలేని ఆమె విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది. వారు అతడిని కలిసి మరోమారు ఇలాంటి పిచ్చివేషాలు వేస్తే కేసు పెడతామని హెచ్చరించారు. వారిచ్చిన వార్నింగ్‌తో గత కొంతకాలంగా ఆమెకు దూరంగా ఉంటున్న శ్రీనివాస్.. గత మంగళవారం ఆమెను మళ్లీ కలిశాడు. తనను పెళ్లి చేసుకోవాలని, లేదంటే యాసిడ్ పోస్తానని బెదిరించాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు శ్రీనివాస్‌ను శనివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

More Telugu News