Ayodhya: సుప్రీంకోర్టు చరిత్రలోనే అత్యంత సుదీర్ఘమైన రెండో కేసుగా ‘అయోధ్య’

  • 40 రోజులపాటు సుదీర్ఘంగా సాగిన విచారణ
  • 1857లో తొలి వ్యాజ్యం నమోదు
  • 162 ఏళ్ల తర్వాత తీర్పు వెల్లడి

సుప్రీంకోర్టు చరిత్రలోనే అత్యంత సుదీర్ఘంగా సాగిన రెండో కేసుగా ‘అయోధ్య’ చరిత్ర సృష్టించింది. ఆగస్టు 6న ఈ కేసు విచారణను ప్రారంభించిన రాజ్యాంగ ధర్మాసనం అక్టోబరు 16వ తేదీ వరకు కొనసాగించింది. ఈ విచారణలో చివరి 40 రోజులు కీలకంగా మారింది. రామజన్మభూమిపై 1857లో న్యాయస్థానంలో తొలిసారి వ్యాజ్యం దాఖలు కాగా, 162 ఏళ్ల తర్వాత శనివారం తుది తీర్పు వెల్లడైంది.

నిజానికి ఈ వివాదాన్ని కోర్టు బయటే పరిష్కరించుకునేందుకు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఖలీఫుల్లా, ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్‌, సీనియర్‌ న్యాయవాది శ్రీరాం పంచుతో కూడిన మధ్యవర్తిత్వ కమిటీని కోర్టు నియమించింది. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో అయోధ్య కేసులో పరిష్కారం కోసం అత్యున్నత న్యాయస్థానం స్వయంగా రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఇక, విచారణలో చివరి రోజు కోర్టులో హైడ్రామా చోటు చేసుకుంది.

రామజన్మభూమికి సంబంధించి అఖిల భారత హిందూ మహాసభ తరపు న్యాయవాది వికాస్‌‌సింగ్‌ చూపించిన మ్యాప్‌ను కోర్టు హాల్‌లోనే ధవన్ చించివేశారు. దీంతో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. దీనిని తీవ్రంగా పరిగణించిన ధర్మాసనం వాకౌట్ చేస్తామని హెచ్చరించడంతో పరిస్థితి సద్దుమణిగింది. అనంతరం అయోధ్యలోని వివాదాస్పద భూమిని హిందువులకు అప్పగించాలని ఆదేశించింది. దీంతో గత 27 ఏళ్లలో ఎన్నో మలుపులు తిరిగిన ఈ కేసుకు నిన్నటి తీర్పుతో ముగింపు పలికినట్టు అయింది.

More Telugu News