Bulbul: పశ్చిమ బెంగాల్ పై 'బుల్ బుల్' పంజా.... పరిస్థితిని సమీక్షిస్తున్న మమత

  • బంగాళాఖాతంలో 'బుల్ బుల్'
  • ఈ రాత్రికి హాల్దియా వద్ద తీరం దాటనున్న తుపాను
  • రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ దళాలు

బంగాళాఖాతంలో కొనసాగుతున్న 'బుల్ బుల్' తుపాను కారణంగా పశ్చిమ బెంగాల్ హడలిపోతోంది. ఇప్పటికే ఒడిశాలో తీవ్ర వర్షాలకు కారణమైన 'బుల్ బుల్' పశ్చిమ బెంగాల్ పైనా ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో అక్కడి సర్కారు అప్రమత్తమైంది. తుపానుపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తుండాలని సీఎం మమతా బెనర్జీ అధికారులను ఆదేశించారు.

సీఎం ఆదేశాలతో తుపాను ప్రభావం చూపుతుందని అంచనా వేసిన ప్రాంతాల్లో 1.2 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సహాయక చర్యల కోసం ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచారు.

'బుల్ బుల్' తుపాను కారణంగా బెంగాల్ తీరప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలులకు చెట్లు నేలకూలాయి. ఓ వ్యక్తి మృతి చెందినట్టు అధికారులు తెలిపారు. కోల్ కతా, పరిసర ప్రాంతాలలో ఎడతెరిపిలేని వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ముందు జాగ్రత్త చర్యగా విమాన సర్వీసులు నిలిపివేశారు. కాగా, 'బుల్ బుల్' తుపాను ఈ రాత్రి 10 గంటల సమయంలో బెంగాల్ లోని హాల్దియా వద్ద తీరం దాటుతుందని వాతావరణ విభాగం పేర్కొంది.

More Telugu News