Kanchanamala: అందాల తార కాంచనమాలను ఆ స్థితిలో చూడలేకపోయారట

  • తొలి తరం గ్లామరస్ హీరోయిన్ కాంచనమాల 
  • ఆమె అందాన్ని భానుమతిగారు మెచ్చుకోవడం విశేషం 
  • ఆ రోజున కాంచనమాలను చూశానన్న ఈశ్వర్  

తెలుగు తెరపై తొలి తరం గ్లామరస్ హీరోయిన్స్ లో 'కాంచనమాల' ఒకరు. చాలా తక్కువ సినిమాలు చేసినా, ఆనాటి యువతరం ప్రేక్షకుల హృదయాలపై ఆమె వేసిన ముద్ర ఎంతో బలమైనది. అలాంటి కాంచనమాలను గురించి సీనియర్ జర్నలిస్ట్ బీకే ఈశ్వర్ ప్రస్తావించారు. "నేను జర్నలిజం లోకి వచ్చేటప్పటికే నటిగా కాంచనమాల నిష్క్రమణం జరిగిపోయింది. అయితే అంతా ఆమెను గురించి గొప్పగా చెప్పుకోవడం నాలో ఒక రకమైన ఆసక్తిని రేకెత్తించింది.

సాధారణంగా ఎవరినీ మెచ్చుకోని భానుమతిగారు సైతం కాంచనమాల అందచందాలను .. అభినయాన్ని గురించి ప్రశంసిస్తూ మాట్లాడటం నాకు ఆశ్చర్యాన్ని కలిగించేది. ఆ సమయంలోనే ప్రముఖ స్టిల్ ఫొటో గ్రాఫర్ జైహింద్ సత్యం గారు .. గూడవల్లి రామబ్రహ్మం గారి సంస్మరణ సభను ఏర్పాటు చేశారు.

ఆ సందర్భంగా 'మాలపిల్ల' సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఆ తరువాత 'మాలపిల్ల' నాయక నాయికలైన గాలి వెంకటేశ్వరరావు - కాంచనమాలను అందరికీ పరిచయం చేశారు. అప్పుడు కాంచనమాల ఏదో కోల్పోయినట్టుగా వున్నారు. ఏదో వెదుకుతున్నట్టుగా వెర్రి చూపులు చూస్తున్నారు. ఆమె ఎవరితోనూ మాట్లాడలేని స్థితిలో ఉండటం చూసి, అక్కడివాళ్లతో పాటు నేను కూడా చాలా బాధపడ్డాను" అని చెప్పుకొచ్చారు.

More Telugu News