Maharashtra: మహారాష్ట్రలో ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ నేతని సీఎం కానివ్వబోము: కాంగ్రెస్ ఎంపీ దల్వాయి

  • బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలను లేకుండా చేస్తాం
  • మా ఎమ్మెల్యేలు ప్రలోభాలకు గురి కారు
  • వారంతా ఒకేమాటపై ఉన్నారు

మహారాష్ట్రలో ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ నేతని సీఎం కానివ్వబోమని కాంగ్రెస్ ఎంపీ హుసేన్ దల్వాయి అన్నారు. బీజేపీ మరోసారి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలను లేకుండా చేస్తామని వ్యాఖ్యానించారు. తమ ఎమ్మెల్యేలు ప్రలోభాలకు గురి కాబోరని చెప్పారు. వారంతా ఒకేమాటపై ఉన్నారని, వారు పార్టీ నియమాలను ఉల్లంఘించరని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశాల మేరకు నడుచుకుంటారని అన్నారు  

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) తమ మిత్రపక్షమేనని, వారు తమతోనే ఉన్నారని హుసేన్ దల్వాయి అన్నారు. బీజేపీ నుంచి మహారాష్ట్రను కాపాడేందుకే ఎన్నికల్లో ఓటర్లు తమకు ఓటేశారని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై తాము చర్చించామని తెలిపారు. తమ ఎమ్మెల్యేలను కొనాలనే బీజేపీ ప్రయత్నాలు ఫలించబోవని అన్నారు. అంతేగాక, ఎన్నికలకు ముందు పార్టీ ఫిరాయించి బీజేపీలో చేరిన కొందరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు మళ్లీ తమ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు.

More Telugu News