Sidhu: వెళ్లాలా, వద్దా?... ఏదో ఒక విషయం చెప్పండి: కేంద్రానికి మరో లేఖ రాసిన సిద్ధూ

  • ఈ నెల 9న పాక్ లో కర్తార్ పూర్ కారిడార్ ప్రారంభోత్సవం
  • వెళ్లేందుకు అనుమతించాలంటూ సిద్ధూ విజ్ఞప్తి
  • స్పందించని కేంద్రం

కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ కేంద్రానికి మరోసారి లేఖ రాశారు. పాకిస్థాన్ లోని కర్తార్ పూర్ సాహిబ్ కారిడార్ ప్రారంభోత్సవానికి వెళ్లేందుకు అనుమతించాలంటూ తన లేఖలో విజ్ఞప్తి చేశారు. తనకు పాకిస్థాన్ వీసా కూడా మంజూరు చేసిందని వెల్లడించారు. "ఇప్పటికి పలుమార్లు ఈ విషయాన్ని మీ దృష్టికి తెచ్చినా స్పందన లేదు. కర్తార్ పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతి ఇస్తుందో ఇవ్వదో కూడా చెప్పడంలేదు" అంటూ కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్ కు రాసిన లేఖలో సిద్ధూ తన అసహనాన్ని వ్యక్తం చేశారు.

సిక్కుల పవిత్ర పుణ్యక్షేత్రమైన కర్తార్ పూర్ సాహిబ్ కారిడార్ ను పాకిస్థాన్ ప్రభుత్వం ఈ నెల 9న ప్రారంభిస్తోంది. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఈ కార్యక్రమానికి తన స్నేహితుడైన సిద్ధూను కూడా ఆహ్వానించారు. కొన్నాళ్ల కిందట ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ ప్రమాణస్వీకారం చేస్తుంటే సిద్ధూ కూడా హాజరై శుభాకాంక్షలు తెలిపాడు.  

More Telugu News