Smrthi Mandhana: వన్డేల్లో వేగంగా 2 వేల పరుగుల మైలురాయికి చేరిన మూడో మహిళా క్రికెటర్ గా స్మృతి మంధాన

  • భారత మహిళా క్రికెటర్లలో తొలి క్రికెటర్ గా రికార్డ్
  • పురుష క్రికెటర్లతో పోల్చితే ధావన్ తర్వాత స్థానం
  • కోహ్లీ,గంగూలీ, సిద్ధూలను అధిగమించిన మంధాన

మహిళల వన్డే క్రికెట్లో వేగంగా రెండువేల పరుగుల మైలురాయిని అందుకున్న మూడో క్రికెటర్ గా స్మృతి మంధాన రికార్డు నమోదు చేసింది. వెస్టిండీస్ తో జరిగిన మూడో వన్డేలో మంధాన 74 ( తొమ్మిది బౌండరీలు, మూడు సిక్సర్ల సాయంతో) పరుగులు చేసింది. ఇందుకు 63 బంతులను ఎదుర్కొంది. ఈ మ్యాచ్ ను భారత్ 6 వికెట్ల తేడాతో గెలుచుకుంది. ప్రస్తుతం మంధాన మొత్తం 51 వన్డేలు ఆడి 2025 పరుగులు చేసింది.

ఈ మైలురాయికి చేరిన తొలి మహిళా క్రికెటర్ గా ఆస్ట్రేలియాకు చెందిన మాజీ క్రికెటర్ బెలిండా క్లార్క్, ప్రస్తుత జట్టు కెప్టెన్ మెగ్ లానింగ్ లు తొలి రెండు స్థానాల్లో నిలిచారు. వీరు ఈ రికార్డుకు చేరుకోవడానికి చెరి 45 ఇన్నింగ్స్ లు ఆడారు. పురుష క్రికెటర్లలో తమ కెరియర్లో 2 వేల పరుగుల మైలురాయిని వేగవంతంగా అందుకున్న వారిలో సఫారీ బ్యాట్స్ మన్ హషీం ఆమ్లా (40 ఇన్నింగ్స్ లు) ఉన్నాడు.

ఇక భారత్ నుంచి చూస్తే.. ఈ రికార్డును అందుకున్న వారిలో శిఖర్ ధావన్ (48 ఇన్నింగ్స్ లు) తొలి స్థానంలో ఉన్నాడు. తర్వాతి స్థానాల్లో వరుసగా కోహ్లీ  (53 ఇన్నింగ్స్ లు), సౌరవ్ గంగూలీ (52 ఇన్నింగ్స్ లు), సిద్ధూ (52 ఇన్నింగ్స్ లు) ఉన్నారు. వీరితో పోలిస్తే  కోహ్లీ, గంగూలీ, సిద్ధూల రికార్డును మంధాన (51 ఇన్నింగ్స్ లు) అధిగమించింది. విండీస్ పర్యటనలో నిన్నటి వన్డే గెలిచిన భారత మహిళా జట్టు సిరీస్ ను 2-1తో సొంతం చేసుకోగా, ఐదు మ్యాచ్ ల టీ 20 సిరీస్ లో భాగంగా  శనివారం ఆతిథ్య జట్టుతో భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది.            

More Telugu News