Nitin Gadkari: మిగిలింది ఒక్కరోజే... హుటాహుటిన మహారాష్ట్రకు చేరుకున్న నితిన్ గడ్కరీ!

  • రాష్ట్రపతి పాలన దిశగా మహారాష్ట్ర
  • గడువు ముగిసేలోగా పరిస్థితి చక్కదిద్దాలని భావిస్తున్న గడ్కరీ
  • సీఎం పీఠం గడ్కరీకి దక్కే అవకాశాలు!

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు మరొక్క రోజే సమయం ఉండటం, శనివారంలోగా కొత్త ప్రభుత్వం కొలువు దీరకుంటే రాష్ట్రపతి పాలన తప్పనిసరి అయ్యే పరిస్థితుల్లో, బీజేపీ, శివసేన రాష్ట్ర నేతల మధ్య సమన్వయాన్ని కుదిర్చేందుకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హుటాహుటిన మహారాష్ట్రకు చేరుకున్నారు.

తనకున్న అన్ని అపాయింట్ మెంట్లు, అధికారిక కార్యక్రమాలను క్యాన్సిల్ చేసుకున్న గడ్కరీ, నాగపూర్ కు వచ్చారు. ఆయన నేడు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ను ప్రత్యేకంగా కలుస్తారని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. నాగపూర్ లో మహారాష్ట్ర ప్రస్తుత రాజకీయ పరిస్థితిపై పలువురు నేతలతో చర్చించనున్నట్టు నితిన్ గడ్కరీ, తన ప్రయాణానికి ముందు మీడియాకు తెలిపారు.

కాగా, ఫడ్నవీస్ స్థానంలో గడ్కరీని సీఎంగా ప్రతిపాదిస్తే, శివసేన నుంచి అభ్యంతరాలు ఉండక పోవచ్చన్న వార్తలూ వస్తున్నాయి. ఇరు పార్టీలకూ కావాల్సిన వ్యక్తిగా సీఎం పీఠంపై గడ్కరీని కూర్చోబెట్టాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది. తాము సూచించిన విధంగా సీఎం పదవిని చెరి సగం పంచుకునేందుకు దేవేంద్ర ఫడ్నవీస్ ఎంతమాత్రమూ అంగీకరించక పోవడంతో, అతన్ని గద్దెనెక్కించే పనే లేదని శివసేన తేల్చి చెబుతోంది. మంగళవారం నాడు మోహన్ భగవత్ ను ఫడ్నవీస్ కలిసి చర్చించిన గంటల వ్యవధిలో నితిన్ గడ్కరీ రంగంలోకి దిగడం గమనార్హం.

More Telugu News