Nawaz sharif: పాలస్తీనా నేతకు ఇచ్చినట్టు నవాజ్‌కు స్లో పాయిజన్ ఎక్కించారు: ఎంక్యూఎం అధినేత సంచలన వ్యాఖ్యలు

  • నవాజ్ శరీరంలోకి పోలోనియం అనే డ్రగ్‌ను ఎక్కించారు
  • శత్రువులను మట్టుబెట్టేందుకే దీనిని వాడతారు
  • మామూలుగా ఈ విషయాన్ని తెలుసుకోవడం కష్టం

పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను హత్య చేసేందుకు ప్లాన్ జరుగుతోందని ఎంక్యూఎం అధినేత అల్తాప్ హుస్సేన్ ఆరోపించారు. పాలస్తీనా నేత యాసర్ అరాఫత్‌కు ఇచ్చినట్టే షరీఫ్‌కు కూడా పోలోనియం అనే డ్రగ్‌ను ఆయన శరీరంలోకి ఎక్కించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. యాసర్ అరాఫత్ ఈ డ్రగ్ కారణంగానే మరణించారన్నారు. షరీఫ్ విషయంలోనూ ఇప్పుడు అదే జరుగుతోందని అల్తాఫ్ ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ డ్రగ్ వల్ల నవాజ్ శరీరంలో ప్లేట్‌లెట్ల సంఖ్య పడిపోతోందన్నారు. శత్రువులను మట్టుబెట్టేందుకు ఈ డ్రగ్‌ను వాడతారన్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు. ఈ డ్రగ్ వాడిన విషయం కూడా ఎవరికీ తెలియదని, ప్రత్యేక ప్రయోగశాలల్లో మాత్రమే ఇది వాడిన విషయాన్ని గుర్తించగలరన్నారు. అంతర్జాతీయ ల్యాబ్‌లో పరీక్షలు జరిపి నిజాన్ని నిగ్గు తేల్చాలని అల్తాఫ్ డిమాండ్ చేశారు.

కాగా, పోలోనియం డ్రగ్‌కు సంబంధించిన పరిశోధనాత్మక కథనాన్ని అల్తాప్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. ఈ డ్రగ్ వల్ల డీఎన్‌ఏ దెబ్బతినడంతో పాటు క్యాన్సర్‌కు దారి తీస్తుందని కథనంలో పేర్కొన్నారు. పలు అవినీతి కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న నవాజ్ షరీఫ్‌‌కు ప్రస్తుతం ఇంటి వద్దే ఐసీయూ వసతి ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు.  

More Telugu News