Chandrababu: నా ఇల్లు ముంచాలనే వైసీపీ నేతలు ఆలోచిస్తుంటారు.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు

  • వ్యాధులతో ప్రజలు చనిపోతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది
  • ఇసుక ఉచితంగా ఇస్తే, భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలు ఆగిపోతాయి
  • జగన్ సీఎం అయ్యాక ప్రాజెక్టుల పనులు ఆగిపోయాయి

జగన్ సీఎం అయ్యాక రాష్ట్రంలో ప్రాజెక్టుల పనులు ఆగిపోయాయని, ఎక్కడా తట్ట మట్టి తీసి కాంక్రీట్ వేయలేదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. వైసీపీ నేతలు ఎల్లప్పుడు నా ఇల్లు ముంచాలన్న ఆలోచనలో ఉంటారని పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాలో చంద్రబాబు పర్యటిస్తున్నారు.  

ఐతేపల్లిలో జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్న సందర్భంగా బాబు మాట్లాడుతూ వైసీపీ పాలనపై విరుచుకుపడ్డారు. మలేరియా, డెంగీ, అంటువ్యాధులతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. ఇసుకను ఉచితంగా ఇస్తే కార్మికుల ఆత్మహత్యలు ఆగుతాయని తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.25లక్షల పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు.

దోమలపై యుద్ధం చేశానని తనను ఎగతాళి చేశారన్న విమర్శపై చంద్రబాబు స్పందిస్తూ.. పేదల ఆరోగ్యం కోసమే దోమలపై అప్పుడు యుద్ధం చేశానని చెప్పారు. ప్రస్తుతం మలేరియా, డెంగీ, అంటువ్యాధులు ఎందుకు విస్తరిస్తున్నాయని సీఎం జగన్ ను ప్రశ్నించారు. ఆయన చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన ఉండదని, అదే అతని నీతీ నిజాయతీ అని విమర్శించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో 300 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. రైతు భరోసా మొత్తాన్ని ఒకేసారి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

More Telugu News