LV Subrahmanyam: ఎల్వీ సుబ్రహ్మణ్యం పరిస్థితే మీ అందరికీ వస్తుంది: పోలీసు అధికారులకు చంద్రబాబు హెచ్చరిక

  • అన్నా అంటూ తియ్యగా పిలిచి... క్లర్క్ మాదిరి బదిలీ చేశారు
  • నంగనాచి మాటలు చెప్పే వారిని నమ్మొద్దు
  • ప్రభుత్వంలో ఉన్నవారి దుర్మార్గాల్లో భాగస్వాములు కావొద్దు

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ అంశం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై చంద్రబాబు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్ పై విమర్శలు గుప్పించారు. జగన్ సీఎం అయిన కొత్తలో ఎల్వీ సుబ్రహ్మణ్యం అన్నా, గౌతం అన్నా అంటూ తియ్యతియ్యగా పిలిచారని... నాలుగు రోజులు తిరక్కుండానే ఓ క్లర్క్ మాదిరి బదిలీ చేశారంటూ విమర్శించారు. ఎల్వీ సుబ్రహ్మణ్యంను బాపట్లకు బదిలీ చేయడానికి ముందే... అక్కడ ఎవరూ లేకుండా అధికారులను పీకేశారని చెప్పారు. నంగనాచి మాటలు చెప్పే వారిని ఎవరూ నమ్మవద్దని సూచించారు. నమ్మి చెప్పిన పని చేసిన వారిని ఇప్పటికే ఒకసారి జైలుపాలు చేశారని... మళ్లీ నమ్మితే, ఇదే పరిస్థితి మళ్లీ తలెత్తుతుందని చెప్పారు.

ప్రభుత్వంలో ఉన్నవారు చెప్పారని, వారి దుర్మార్గాల్లో భాగస్వాములు కావద్దని పోలీసు అధికారులకు విన్నవిస్తున్నానని చంద్రబాబు అన్నారు. ఏదైనా తేడా వస్తే ఎల్వీ సుబ్రహ్మణ్యానికి వచ్చిన పరిస్థితే మీకూ వస్తుందని చెప్పారు. కేసులు పెట్టాలంటూ అధికారులను ఉసిగొల్పుతున్నారని... వారు అలా చేయరనే తాను భావిస్తున్నానని తెలిపారు. ఎల్వీ సుబ్రహ్మణ్యం టీడీపీకి నష్టమే చేశారని... అయినా, ఆయన పట్ల టెర్రరిస్టుల మాదిరి వ్యవహరిస్తే మాట్లాడకుండా ఎలా ఉండగలమని చెప్పారు.

More Telugu News