Telangana: మరికొన్ని గంటల్లో ముగియనున్న ఆర్టీసీ కార్మికుల గడువు... సర్వత్ర ఉత్కంఠ!

  • నవంబరు 5 అర్ధరాత్రిలోగా విధుల్లో చేరాలని సర్కారు గడువు
  • ససేమిరా అంటున్న కార్మిక సంఘాల జేఏసీ
  • 5100 రూట్లను ప్రైవేటు పరం చేస్తామని కేసీఆర్ హెచ్చరిక

తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు కొనసాగిస్తున్న సమ్మె ఇవాళ్టితో 32వ రోజుకు చేరుకుంది. అటు సర్కారు కానీ, ఇటు కార్మికులు కానీ పట్టు సడలించకపోవడంతో ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఇటీవల సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించిన అనంతరం ఆర్టీసీ కార్మికులకు గడువు విధించారు. నవంబరు 5వ తేదీ అర్ధరాత్రి లోపు విధుల్లో చేరకుంటే కార్మికులతో ఆర్టీసీ సంస్థకు ఎలాంటి సంబంధం ఉండదని, వారిని ఇక ఉద్యోగులుగా పరిగణించబోమని కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన విధించిన గడువు ముగిసేందుకు మరికొన్ని గంటలు మాత్రమే మిగిలుంది.

అయితే ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ మాత్రం కార్మికులెవరూ విధుల్లో చేరబోరని తేల్చిచెబుతుండగా, రేపు కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తి కలిగిస్తోంది. కార్మికులు విధుల్లో చేరకపోతే 5100 రూట్లలో బస్సులు తిప్పేందుకు ప్రైవేటు వ్యక్తులకు అనుమతి ఇస్తామని కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

More Telugu News