swamy Ayyappa: స్వామి అయ్యప్ప ఐదు రాష్ట్రాలను కలిపారు: ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు

  • తిరువనంతపురలో ఐదురాష్ట్రాల సీఎంలు, దేవాదాయశాఖల మంత్రుల సమావేశం
  • పలు ప్రతిపాదనలకు కేరళ సీఎం పినరయి విజయన్ సానుకూలం
  • కేరళలో ప్లాస్టిక్ వాడకంపై నిషేధం కొనసాగుతోందని భక్తులకు సూచన

స్వామి అయ్యప్ప ఐదు రాష్ట్రాలను కలిపారని, అయ్యప్ప భక్తులకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టడం పై తిరువంతపురం సమావేశంలో చర్చించడం జరిగిందని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ముఖ్యంగా అయ్యప్ప భక్తులు ప్లాస్టిక్ సంచులు ప్లాస్టిక్ వాడకం పూర్తిగా తగ్గించాలని, కేరళలో ప్లాస్టిక్ నిషేధం అమలు జరుగుతుందన్నారు. 

కేరళలో నవంబరు 17 నుంచి మండల, మకరవిలక్కు ఉత్సవాలు జరుగనున్న నేపథ్యంలో ఈ రోజు తిరువనంతపురంలో ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ ఆధ్వర్యంలో ఐదు రాష్ట్రాల సీఎంలు, దేవాదాయశాఖల మంత్రుల సమావేశం జరిగిందని చెప్పారు. ఏపీ ప్రభుత్వం తరపున ప్రతినిధిగా తాను పాల్గొన్నానన్నారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అయ్యప్ప స్వాముల కోసం శబరిమలైలో కొండపైన, కొండ దిగువన అతిథి గృహం, వసతి నిర్మాణానికి  స్థలం కేటాయించమని కేరళ ప్రభుత్వాన్ని కోరినట్లు మంత్రి తెలిపారు.

 సమావేశంలో తాము లేవనెత్తిన అంశాలపై కేరళ సీఎం సానుకూలంగా స్పందించారన్నారు. ప్రతి రాష్ట్రంలోని ఆయా రాష్ట్ర ప్రభుత్వాల హెల్ప్ డెస్క్ లను అనుసంధానిస్తూ  కేరళ లో జాయింట్ గా ఐదు రాష్ట్రాలతో కలిపి సెంట్రల్ హెల్ప్ సెంటర్ ఏర్పాటు చేస్తామని విజయన్ హామీ ఇచ్చారని తెలిపారు. సమావేశం అనంతరం అనంత పద్మనాభ స్వామి వారిని దర్శించుకుని ఆశీర్వాదం పొందినట్లు మంత్రి వెల్లడించారు. ఈ సందర్భంగా, వివిధ రాష్ట్రాల ప్రతినిధులకు, కేరళ సీఎం విజయన్ కు కనకదుర్గ అమ్మవారి ప్రసాదం అందజేసి వారిని సన్మానించినట్లు మంత్రి వెల్లంపల్లి చెప్పారు.

More Telugu News