Chandrababu: చంద్రబాబు బుర్ర పాడైనట్టుంది, బాలల దినోత్సవం నాడు దీక్ష చేస్తాడట!: బొత్స విమర్శలు

  • చంద్రబాబు సీఎంను వ్యక్తిగతంగా దూషిస్తున్నారని ఆరోపణ
  • చంద్రబాబు నిర్వాకం వల్లే రాష్ట్రం ఇలా తయారైందన్న బొత్స
  • సీఎస్ బదిలీ వ్యవహారం చర్చించాల్సిన అంశం కాదని వెల్లడి

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. సీఎం జగన్ పై చంద్రబాబు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నిర్వాకం కారణంగానే రాష్ట్రం భ్రష్టుపట్టిందని ఆరోపించారు. జీతాలు ఇవ్వలేని స్థాయికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దయనీయంగా మార్చివేశారంటూ విమర్శించారు.

భవన నిర్మాణ కార్మికులకు వైఎస్ హయాంలో న్యాయం జరిగిందని, ఇవాళ భవన నిర్మాణ కార్మికుల కోసం చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు బుర్ర పాడైనట్టు అనిపిస్తోందని, ఆయన బాలల దినోత్సవం నాడు దీక్ష చేస్తానని చెప్పడమే అందుకు నిదర్శనమని బొత్స వ్యంగ్యం ప్రదర్శించారు.

అంతేకాకుండా, ఏపీ రాజధాని, ప్రాజెక్టులపై కమిటీ వేశామని, త్వరలోనే ఆ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత రాజధానిపై వివరాలు చెబుతామని వెల్లడించారు. చంద్రబాబులాగా తొందరపడి ప్రజలను ఇబ్బంది పెట్టబోమని అన్నారు. ఏపీ సీఎస్ పదవి నుంచి ఎల్వీ సుబ్రహ్మణ్యంను బదిలీ చేయడంపైనా బొత్స స్పందించారు. సీఎస్ బదిలీ పాలనా వ్యవహారాల్లో భాగమని, ఇది చర్చించాల్సిన అంశం కాదని స్పష్టం చేశారు.

More Telugu News